Pawan Kalyan: చిత్తూరు అడవిలో భూముల ఆక్రమణపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, వాతావరణ-అటవీశాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్.. చిత్తూరు జిల్లాలోని అడవి భూముల ఆక్రమణ వ్యవహారంపై కఠినంగా స్పందించారు. 2019 నుండి 2024 మధ్య కాలంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, ఇతరులు చిత్తూరు జిల్లా పరిధిలోని అటవీ భూములను ఆక్రమించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ వ్యవహారంపై జరిగిన సమీక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. భూ ఆక్రమణలకు పాల్పడుతున్న వారికి వార్నింగ్ ఇచ్చారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ ఇచ్చిన నివేదికలో ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలనీ, బాధ్యత వహించని అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు.
పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుటుంబం మాత్రమే కాక, బుగ్గ మఠానికి చెందిన భూములను కూడా ఆక్రమించినట్లు ఈ నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. భూముల పరిరక్షణలో విఫలమైన అధికారులపై డిపార్టుమెంటల్ చర్యలు ప్రారంభించేందుకు పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఆక్రమణదారులపై పర్యావరణ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆయన స్పష్టం చేశారు.ఈ కేసు పరిశీలన కోసం ఆయన సంబంధిత శాఖల నుండి పూర్తి నివేదిక కోరారు. బాధ్యుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, ప్రకృతి సంపదను రక్షించడంలో ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంటుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఈ చర్యలతో భూఆక్రమణలపై ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించదని స్పష్టమవుతోంది. అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ ఆధిపత్యం వల్ల నష్టపోయిన అడవీ భూములను తిరిగి ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవడం కోసం చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఇదిలావుండగా, భారతదేశం-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల మధ్య ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుతో పార్టీ శ్రేణులు పలు పవిత్ర ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాయి. భారత సైన్యానికి శక్తి ప్రసాదించాలని కోరుతూ, జనసేన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని ఎనిమిది ముఖ్య సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలను సందర్శించారు.
జనసేన ప్రభుత్వ విప్ మరియు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్వామిమలై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. “25 నిమిషాల్లో తొమ్మిది ఉగ్రశిబిరాలను లక్ష్యంగా చేసుకున్న సైనికుల విజయానికి దేవుని ఆశీస్సులు కారణమవుతాయని నమ్ముతున్నాం” అని ఆయన అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని ఈ చర్యలు "ధర్మ యుద్ధం"గా అభివర్ణించారు.