క్వారీలు పేలుతున్నాయి... అన్ని తెలుసంటారు.. ఇది తెలియదా..? బాబుకు పవన్ ప్రశ్న
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్ వద్ద క్వారీలో జరిగిన పేలుడు ప్రమాదంలో బాధితులను పవన్ ఇవాళ పరామర్శించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్ వద్ద క్వారీలో జరిగిన పేలుడు ప్రమాదంలో బాధితులను పవన్ ఇవాళ పరామర్శించారు. తొలుత ప్రమాదానికి కారణమైన హత్తిబెళగల్కు వెళ్లి క్వారీని పరిశీలించారు.. అనంతరం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఇలాంటి సంఘటనలు దురదృష్టకరమని.. రాష్ట్రంలో అక్రమ మైనింగ్కు అడ్డుకట్ట వేసినప్పుడు హత్తిబెళగల్ లాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని పవన్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలను సమర్థించి.. ప్రజా సమస్యలను పక్కనబెట్టొద్దని కోరారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అక్రమంగా మైనింగ్ జరుగుతుంటే గనుల శాఖ మంత్రి, ఆ శాఖ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
ఒక్క కర్నూలు జిల్లాలోనే 1600 క్వారీలకు అనుమతులుంటే.. మరో 600 వరకు అక్రమ క్వారీలు నడుస్తున్నాయని తెలిపారు. స్థానిక యువకులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపై త్వరలోనే స్పందిస్తానని హామీ ఇచ్చారు.
అంతకు ముందు పవన్ రాక సందర్భంగా కర్నూలులోని టోల్గేట్ నుంచి హనుమాన్ సర్కిల్ వరకు అభిమానుల, జనసేన కార్యకర్తలు మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టి.. క్వారీ వరకు వెళ్లారు. క్వారీ మొత్తం అభిమానులతో నిండిపోవడంతో పోలీసులు వారిని అదుపు చేయలేక చేతులెత్తేశారు. ఒక దశలో పేలుడు జరిగిన స్థలాన్ని కూడా పవన్ పరశీలించలేకపోయారు. అయితే అతికష్టం మీద పోలీసులు ఆయనను అక్కడికి తీసుకెళ్లారు.