డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు 4% వడ్డీకే రుణాలిచ్చే ‘ఎన్టీఆర్ విద్యా సంకల్పం’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించనుంది.

ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా సంఘాల మహిళల పిల్లల చదువుకు ఆర్థిక సహాయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రుణ పథకాన్ని తీసుకొస్తోంది. 'ఎన్టీఆర్ విద్యా సంకల్పం'గా పేరుపెట్టిన ఈ పథకం ద్వారా తక్కువ వడ్డీకే రుణాలను అందించనున్నారు. ప్రస్తుతం స్త్రీనిధి బ్యాంక్ ద్వారా డ్వాక్రా సభ్యులు 11 శాతం వడ్డీకే రుణాలు తీసుకుంటున్నారు. అయితే ఈ కొత్త పథకంలో వారు కేవలం 4 శాతం వడ్డీకే రూ.10 వేల నుంచి రూ.1 లక్ష వరకు రుణాన్ని పొందవచ్చు.

ఖర్చులను తగ్గించడానికే..

ఈ పథకాన్ని పిల్లల చదువులో వచ్చే ఖర్చులను తగ్గించడానికే రూపొందించారు. పాఠశాల ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం, సైకిళ్లు, టెక్నికల్ కోర్సులకు అవసరమైన వస్తువులు వంటి వాటి కొనుగోలుకు ఈ రుణాన్ని వినియోగించవచ్చు. ప్రభుత్వం రూపొందించిన గైడ్‌లైన్స్ ప్రకారం, రుణం తీసుకున్న వారు దానిని ఏ అవసరానికి ఉపయోగించారో సంబంధిత రసీదులను స్త్రీనిధి అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే…

కేజీ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థుల తల్లులు ఈ పథకానికి అర్హులు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే పిల్లలకు ఇది వర్తించనుంది. రుణాన్ని నెలవారీ వాయిదాలుగా తిరిగి చెల్లించవచ్చు. రుణ పరిమాణాన్ని బట్టి కనీసం 24 నెలలు నుంచి గరిష్ఠంగా 36 నెలల వరకూ తిరిగి చెల్లించే వీలుంటుంది.

ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి సుమారు రూ.200 కోట్లు వెచ్చించనున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలో ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. లక్షలాది మహిళల పిల్లల విద్యాభవిష్యత్తుకు ఇది ఒక మంచి మార్గం కానుంది.