పాలకుల పంథాలోనే...మహిళా ఉద్యోగిణిపై ఉన్నతాధికారి దాడి: నారా లోకేష్
మాస్క్ ధరించాలని చెప్పినందుకు ఓ మహిళా ఉద్యోగిణిపై డిప్యూటీ మేనేజర్ స్థాయి అధికారి విచక్షణారహితంగా దాడికి పాల్పడిన దారుణం నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.
అమరావతి: రోజురోజుకు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని ప్రభుత్వాలే చెబుతున్నాయి. అలాంటిది మాస్క్ ధరించాలని చెప్పినందుకు ఓ మహిళా ఉద్యోగిణిపై డిప్యూటీ మేనేజర్ స్థాయి అధికారి విచక్షణారహితంగా దాడికి పాల్పడిన దారుణం నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.
ఏపీ టూరిజం శాఖలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగిణి ఉషారాణిపై డిప్యూటీ మేనేజర్ గా పనిచేస్తున్న భాస్కర్ విచక్షణారహితంగా దాడికి దిగి గాయపర్చాడు. దీనిపై మాజీ మంత్రి, టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు.
''మానవ మృగాలు రెచ్చిపోతుంటే బాధితులకు 21 రోజుల్లో న్యాయం చేసేందుకు తెచ్చిన దిశ చట్టం ఎక్కడ జగన్రెడ్డిగారు? మహిళలపై అత్యాచారాలు, దాడులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. పాలకులే ప్రతీకారంతో చెలరేగిపోతుంటే కొందరు అధికారులు అదే పంథాలో అరాచకంగా వ్యవహరిస్తున్నారు'' అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
''నెల్లూరు ఏపి టూరిజం కార్యాలయంలో మాస్కు పెట్టుకోమన్న దివ్యాంగురాలైన ఓ మహిళా ఉద్యోగిని అత్యంత దారుణంగా హింసించిన డిప్యూటీ మేనేజర్ భాస్కర్ ని సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవటం కాదు. కఠినంగా శిక్షించాలి'' అని లోకేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
read more మాస్కు పెట్టుకోవాలని చెప్పినందుకు మహిళా ఉద్యోగినిపై రాడ్తో దాడి
మాస్కు పెట్టుకోవాలని కోరినందుకు గాను మహిళా ఉద్యోగిణిపై భాస్కర్ దాడికి పాల్పడిన ఘటన ఈ నెల 27వ తేదీనే చోటు చేసుకొంది. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కార్యాలయంలోని సీసీటీవీ పుటేజీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. అయినప్పటికి పోలీసులు పట్టించుకోలేదని బాధితురాలు ఆరోపించారు. అయితే మీడియాలో కధనాలు రావడంతో అరెస్ట్ చేశారన్నారు.
ఈ విషయమై ఇవాళ మీడియాలో కథనాలు రావడంతో పోలీసులు చర్యలు తీసుకొన్నారని బాధితురాలు మీడియాకు తెలిపారు. మీడియాలో వచ్చిన కథనాలపై ఏపీ టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. బాధితురాలితో మంత్రి అవంతి శ్రీనివాస్ ఇవాళ ఫోన్ లో మాట్లాడారు.
నిందితుడిని ఉద్యోగం నుండి తొలగిస్తామని మంత్రి హామీ ఇచ్చారని బాధితురాలు మీడియాకు తెలిపారు. మాస్కు పెట్టుకోవాలని కోరినందుకే తనపై దాడి చేశారన్నారు. గతంలో భాస్కర్ తో తనకు ఎలాంటి గొడవలు లేవని ఆమె వివరించారు.