చంద్రబాబు...రెండుకళ్ళ సిద్దాంతం
తాను ప్రతిపక్షంలో ఉన్న తెలంగాణాలో మాత్రం టిడిపి బాగా ఆందోళనలు చేయాలి. అదికారంలో ఉన్న ఏపిలో మాత్రం ప్రతిపక్షం నోరుమూసుకుని కూర్చోవాలి. ఎలాగుంది చంద్రన్న రెండుకళ్ళ సిద్దాంతం?
చంద్రబాబునాయుడు రెండు కళ్ళ సిద్ధాంతంతోనే నెట్టుకొచ్చేస్తున్నారు. తెలంగాణా టిడిపి విషయంలో ఒకలాగ మాట్లాడుతూ, ఏపిలో వైసీపీ విషయంలో మాత్రం ఇంకోలాగ మాట్లాడుతున్నారు. సోమవారం జరిగిన తాజా సమావేశమే అందుకు నిదర్శనం. తెలంగాణా టిడిపి నేతలతో మాట్లాడుతూ, టిఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్షం హోదాలో టిడిపి చేస్తున్న పోరాటాలను అభినందించారు. ప్రజా సమస్యలపై టిడిపి నేతలు వీలైనంతగా ప్రజల్లోకి చొచ్చుకుపోవాలని, ప్రజా సమస్యలపై ఉద్యమించాలంటూ గట్టిగా చెప్పారు.
సరే, ప్రతిపక్షమన్నాక ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపాల్సిందే. ప్రజా పోరాటాలూ చేయాల్సిందే. ఎవరూ కాదనలేరు. పోరాటాలు చేస్తున్న నేతలను అభినందించిన చంద్రబాబు మరి ఏపి విషయానికి వచ్చే సరికి మాట మార్చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి జరుగుతోందని, అక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తోంది. ప్రజాందోళనలు చేస్తోంది. విశాఖపట్నంలో జరిగిన భూకుంభకోణంపై వైసీపీ ఏస్ధాయిలో ప్రతిపక్ష నేతలను కూడగట్టుకుని ఆందోళనలు చేస్తోందో అందరూ చూస్తున్నదే.
తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ చేస్తున్న ఆందోళనలను మాత్రం సహించలేకున్నారు. ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండటమే రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యమంటున్నారు. ప్రతిపక్షం రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతోందంటూ శాపనార్దాలు పెడుతున్నారు. ఎన్నివిధాలుగా తిట్టాలో, శాపనార్ధాలు పెట్టాలో అంతా చేస్తున్నారు. అంటే తాను ప్రతిపక్షంలో ఉన్న తెలంగాణాలో మాత్రం టిడిపి బాగా ఆందోళనలు చేయాలి. అదికారంలో ఉన్న ఏపిలో మాత్రం ప్రతిపక్షం నోరుమూసుకుని కూర్చోవాలి. ఎలాగుంది చంద్రన్న రెండుకళ్ళ సిద్దాంతం?