40 నియోజకవర్గాల్లో టిడిపి బలహీనంగా ఉందా ?
- రాష్ట్రంలోని 40 నియోజకవర్గాల్లో టిడిపి పరిస్ధితి బలహీనంగా ఉందా?
రాష్ట్రంలోని 40 నియోజకవర్గాల్లో టిడిపి పరిస్ధితి బలహీనంగా ఉందా? తాజాగా చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. మంత్రులు, ఎంఎల్ఏ, ఎంపిలతో చంద్రబాబు పార్టీ పరిస్ధితిపై సమీక్షించారు. ఆ సంరద్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, 40 నియోజకవర్గాల్లో పరిస్ధితి బలహీనంగా ఉందని వ్యాఖ్యానించటం పార్టీలో కలకలం రేపింది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం బలహీన నియోజకవర్గాల్లో అత్యధికం రాయలసీమలోని నాలుగు జిల్లాల్లోనే ఉన్నట్లు సమాచారం.
చంద్రబాబు మాట్లాడుతూ, పార్టీ కోసం పనిచేసే వారికే పార్టీలో పదవులు ఇస్తానని స్పష్టంగా చెప్పారు. మంత్రులు, ఎంఎల్ఏల్లో అత్యధికులు ఎక్కువగా పార్టీ నేతలను కలుపుకుని పోవటం లేదని తీవ్రఅసంతృప్తి వ్యక్తం చేశారు. ‘రాజకీయాల్లో మొహమాటాలకు తావులేదని, కావాలంటే ఇంటికి పిలిచి భోజనం పెడతానే కానీ పదవులు, టిక్కెట్లు ఇవ్వటం మాత్రం కుదరద’ని చెప్పటంతో పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. పలు నియోజకవర్గాల్లో ప్రధాన కార్యదర్శులకు, మంత్రులు, ఎంఎల్ఏలకు మధ్య సమన్వయం ఉండటం లేదన్నారు. 40 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్ధితి ఆందోళనగా ఉందని చంద్రబాబు అన్నట్లు ప్రచారం మొదలైంది.
గతంలో కన్నా ఎంఎల్ఏలపై ఫిర్యాదులు తగ్గిందన్నారు. రాష్ట్రంలో సంతృప్తస్ధాయిలు కూడా తగ్గుతున్నట్లు చంద్రబాబు చెప్పారట. ఒకపుడు 80 శాతం ప్రజలు తన పాలన పట్ల సంతోషంగా ఉన్నారని చెప్పుకునే వారు. అయితే, తాజాగా చంద్రబాబు మాట్లాడుతూ 54 శాతం జనాలు మాత్రమే సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు. అగ్రిగోల్డ్, నిరుద్యోగభృతి, ఫాతిమా కళాశాల సమస్యల పరిష్కారంపై ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పారు. మొన్నటి వరకూ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలూ టిడిపినే గెలవాలని పదే పదే చెప్పేవారు. అటువంటిది ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో 40 నియోజకవర్గాల్లో పార్టీ బలహీనంగా ఉందని అంగీకరించటం గమనార్హం.