‘సినిమాల్లాగా కనపడుతున్నాయా..? క్షమాపణ చెప్పాల్సిందే’
జగన్ పై మంత్రి యనమల ఫైర్
ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై మంత్రి యనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు. పోలవరం, అమరావతి రెండు సినిమాలని జగన్ అనడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. ఏపీ సమస్యలపై జగన్కు కనీస అవగాహన లేదని రుజువైందన్నారు.
అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు, రాష్ట్ర రాజధాని అమరావతి సినిమాల్లాగా కనపడుతున్నాయా అని ప్రశ్నించారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ, బీజేపీ, జనసేన విధ్వంస రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు.
ప్రధానికి కన్నా ఇచ్చిన వినతిపత్రంలో ప్రత్యేక హోదాను ఎందుకు చేర్చలేదని మంత్రి ప్రశ్నించారు. కాపుల రిజర్వేషన్ గురించి ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు. కాపులకు 5% రిజర్వేషన్ అంశం కేంద్రం వద్ద పెండింగ్లో ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్రాలను బలహీనపరిచి.. కేంద్రం బలపడాలని చూస్తోందని వ్యాఖ్యానించారు.
రాష్ట్రాల నిధులతో కేంద్రం ఖజానా నింపాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం బలంగా ఉంటుందని తెలిపారు. కేంద్ర పెద్దలు ఒంటెద్దు విధానాలను మానుకోవాలన్నారు. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాలకు చేయూత అందించాలని మంత్రి యనమల రామకృష్ణుడు సూచించారు.