రాయలసీమ గడ్డ మీద పుట్టిన తాను ఉత్తరాంధ్రకు వచ్చి మద్దతు ఇస్తున్నానంటే.. సీఎం జగన్ అజెండా ఎంత గొప్పదో ఆలోచించాలని మంత్రి ఆర్కే రోజా కోరారు. చంద్రబాబు సైకిల్ చక్రాలు తుప్పుపట్టాయని.. టీడీపీ రాష్ట్రం కోసం చేసిందేమీ లేదని విమర్శించారు.

రాయలసీమ గడ్డ మీద పుట్టిన తాను ఉత్తరాంధ్రకు వచ్చి మద్దతు ఇస్తున్నానంటే.. సీఎం జగన్ అజెండా ఎంత గొప్పదో ఆలోచించాలని మంత్రి ఆర్కే రోజా కోరారు. చంద్రబాబు సైకిల్ చక్రాలు తుప్పుపట్టాయని.. టీడీపీ రాష్ట్రం కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. మూడు రాజధానులకు మద్దతుగా నిర్వహించిన విశాఖ గర్జన ర్యాలీ‌లో రోజా పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు చేసిన వెధవ పనుల వల్ల, అత్యాశతో దోచుకుని దాచుకోవడం వల్ల.. మన ప్రాంతాలు అన్యాయం అయ్యాయని ఆరోపించారు. 

హైదరాబాద్‌లో జరిగినట్టుగా ఒక్క అమరావతిలో అభివృద్ది జరిగితే.. ఉత్తరాంధ్ర, రాయలసీమ అన్యాయం అయిపోతాయని అన్నారు. అందుకే సీఎం జగన్ పరిపాలన, వికేంద్రీకరణ అని.. మూడు రాజధానులకు శ్రీకారం చుట్టారని అన్నారు. ‘‘పవన్ కల్యాణ్‌కు పెళ్లి చేసుకోవడానికి వైజాగ్ అమ్మాయి కావాలని, పోటీ చేయడానికి గాజువాక కావాలని, నటన నేర్చుకోవడానికి, షూటింగ్‌లకు, సినిమా కలెక్షన్‌లకు కూడా వైజాగ్ కావాలని.. కానీ వైజాగ్‌కు పరిపాలన రాజధాని వద్దు అని అంటున్నారంటే.. ఈ ప్రాంతం అభివృద్ది చెందడం ఆయనకు నచ్చదు’’అని రోజా అన్నారు. 

Also Read: టీడీపీ, జనసేనలను ఉత్తరాంధ్ర ప్రజలు బ్యాన్ చేయాలి.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..

గాజువాక ప్రజలకు పవన్‌ కల్యాణ్ గురించి ముందుగానే తెలుసు కాబట్టి.. చిత్తుగా ఓడించారని అన్నారు. అమరావతి పేరుతో పెయిడ్ ఆర్టిస్టులతో ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రజలకు.. రాయలసీమ, ఉభయ గోదావరి జిల్లాల, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం ప్రజల సపోర్టు ఉందని అన్నారు. 26 జిల్లాల ప్రజలు పన్నులు కడుతున్నారని.. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ది చెందాలన్నారు. 

26 జిల్లాల అభివృద్దిని 29 గ్రామాల్లో పెట్టేమనే వాళ్లు.. గజ్జి కుక్కలు, ఊర కుక్కలు, పిచ్చి కుక్కలు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతి కోసం చేస్తున్న పోరాటం.. రియల్ ఎస్టేట్ కోసం చేసేదని ఆరోపించారు. అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్రను ఎందుకు అభివృద్ది చేయలేదని ప్రశ్నించారు. ‘‘2024 జగన్ అన్న వన్స్ మోర్.. జై ఉత్తరాంధ్ర.. జై జగన్’’ అంటూ రోజా తన ప్రసంగాన్ని ముగించారు. 

ఇక, వికేంద్రీకరణకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ పిలుపునిచ్చిన విశాఖ గర్జన ర్యాలీ చేపట్టిన సంగతి తెలిసిందే. ఎల్‌ఐసీ భవనం సమీపంలోని డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్‌ విగ్రహం నుంచి విశాఖ గర్జన ర్యాలీ ప్రారంభమైంది. అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించిన నాయకులు.. గర్జన ర్యాలీని ప్రారంభించారు. బీచ్‌ రోడ్డులోని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు దాదాపు 3.5 కిలోమీటర్ల మేర విశాఖ గర్జన ర్యాలీ సాగింది. అక్కడ నాయకులు వైస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. 

ఈ ర్యాలీలో స్పీకర్ తమ్మినేని సీతారామ్, మంత్రులు, వైసీపీ ముఖ్య నేతలు, ఉత్తరాంధ్ర వైసీపీ ప్రజాప్రతినిధులు, పలు వర్గాలకు చెందినవారు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. నగరంలో వర్షం కురుస్తున్నప్పటికీ.. విశాఖ గర్జన ర్యాలీ కొనసాగుతుంది. విశాఖ గర్జన ర్యాలీలో పాల్గొన్న వారంతా.. విశాఖకు రాజధాని రావాలంటూ నివాదాలు చేశారు. మూడు రాజధానులతో రాష్ట్రం మొత్తం అభివృద్ది చెందుతుందని పేర్కొన్నారు.