చంద్రబాబు కొత్త పల్లవి: మేకపాటి పైర్
త నాలుగేళ్ల తన వైఫల్యాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజెపికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు.
నెల్లూరు: గత నాలుగేళ్ల తన వైఫల్యాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజెపికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర విభజనకు ఎవరూ అంగీకరించకపోయినా కాంగ్రెస్, బీజేపీ కలిసి చీల్చాయని ఆయన తప్పు పట్టారు.
నాలుగేళ్లు కేంద్రంలోని బీజేపీ ఏ హామీ నెరవేర్చకపోయినా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మౌనంగానే ఉండిపోయారని అన్నారు. ఏపీకి సంజీవని లాంటి ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి పోరాడుతున్నారని తెలిపారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన చంద్రబాబు ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ గ్రాఫ్ తగ్గుతుందని కొత్త పల్లవి అందుకున్నారని ఆయన అన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని మేకపాటి చెప్పారు. కానీ చంద్రబాబు మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. జూన్ 2వ తేదీన నెల్లూరులో జరగనున్న వంచనపై గర్జన ధర్నా కార్యక్రమంలో చంద్రబాబు దుర్మార్గాలను ఎండకడతామని, ప్రధాని మోడీ చేసిన అన్యాయాలను కూడా ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు.
వాస్తవాలను కప్పిపుచ్చి అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అబద్ధాలు చెప్పడంలో గోబెల్స్ను మించిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలు మార్చుకుంటూ యూ టర్న్ తీసుకోవడంలో చంద్రబాబుకు ఏ నేత సాటిరారని తెలిపారు.
వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామాలు చేసినా టీడీపీ ఎంపీలు ఇప్పటికీ డ్రామాలాడుతున్నారని ఆయన విమర్శించారు. రాజకీయాల్లో విలువల కోసం నిరంతరం తపించే వ్యక్తి జననేత వైఎస్ జగనేనని సజ్జల రామకృష్ణారెడ్డి కొనియాడారు.