దారుణం : అల్లరి చేస్తున్నాడని బాలుడిని కొట్టి చంపిన మేనత్త.. !!
అల్లరి చేస్తున్నాడని ఓ చిన్నారిని మేనత్త, మామలు చితకబాదారు. దీంతో దెబ్బలకు తాళలేక ఆ చిన్నారి మృత్యువాత పడ్డాడు.
కడప : అల్లరి చేస్తున్నాడని ఓ బాలుడిని మేనత్త, మామలు చిత్రహింసలు పెట్టి హత్య చేశారు. ఈ ఘటన వైఎస్ఆర్ జిల్లా కడపలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. మృతుడి నానమ్మ ఇందిరమ్మ, తాత జానయ్య, పోలీసుల కథనం మేరకు.. అన్నమయ్య జిల్లా కోనాపురం హరిజనవాడకు చెందిన వెలగచర్ల శివకుమార్, భాగ్యలక్ష్మి దంపతులు కువైట్ లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరు నానమ్మ, తాతయ్యల దగ్గర ఉంటున్నారు. పెద్ద కుమారుడు ఆశ్రిత్ కుమార్ (8)ను బాగా చదివించాలని శివ కుమార్, భాగ్యలక్ష్మిల అనుమతితో కడప ఓం శాంతినగర్ లో ఉంటున్న మేనత్త ఇంద్రజ వద్ద పదిరోజుల క్రితం నానమ్మ, తాతయ్యలు వదిలిపెట్టి వెళ్లారు.
ఇంద్రజ, ఆమె భర్త అంజన్ కుమార్ వై-జంక్షన్ సమీపంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయులు. ఆశ్రిత్ ను తమ బిడ్డలాగా చూసుకుంటామని చెప్పిన వీరు.. బాగా అల్లరి చేస్తున్నాడు అనే కారణంతో బాలుడిని చిత్రహింసలు పెట్టారు. ఈ నెల 3న రాత్రి.. రోజూ లాగానే మేనత్త, మామలు బాలుడిని బాగా కొట్టారు. బాలుడు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు గుర్తించి రిమ్స్ కు తీసుకువెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఇంద్రజ దంపతులు వారి కుమార్తెతో కలిసి పరారయ్యారు. రిమ్స్ మార్చురీలోనే బాలుడి మృతదేహాన్ని కడప డీఎస్పీ శివారెడ్డి పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్ రెడ్డి తెలిపారు.
రావులపాలెంలో అర్థరాత్రి కాల్పుల కలకలం
పరారీలో వున్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, అంజన్ కుమార్ ను ఇంద్రజ మూడేళ్ల క్రితం ప్రేమించి, వివాహం చేసుకుంది. ఈ వివాహం ఇంద్రజ అమ్మానాన్న, అన్నావదినలకు ఇష్టం లేదు. దీంతో వారి మధ్య రాకపోకలు లేవు. ఇంద్రజ కుమార్తె పుట్టినరోజు ఇటీవల ఘనంగా నిర్వహించారు. దీంతో వీరి మధ్య రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఈ ఘోరం జరిగింది.
అన్నయ్య క్షమించు..
తాము చేయరాని తప్పు చేశామని, ఆశ్రిత్ చనిపోయాడని ఇంద్రజ కువైట్ లో ఉన్న తన అన్న శివకుమార్కు వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ పెట్టింది. తర్వాత సెల్ ఫోను స్విచ్ ఆఫ్ చేసి భర్త, కుమార్తెతో కలిసి పరార్ అయింది. మెసేజ్ చూసిన శివకుమార్ ఇంద్రజకు ఫోన్ చేయగా స్విచాఫ్ రావడంతో తన తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులకు సమాచారం ఇచ్చాడు. వారు కడప రిమ్స్ కు హుటాహుటిన చేరుకుని బాలుడి మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు.