కడప మహానాడు సక్సెస్ అయ్యింది. ఈ క్రమంలో మహానాడు నిర్వహణకు సహకరించిన టిడిపి నాయకులకు అభినందనలు, కార్యకర్తలకు హ్యాట్సాఫ్ తెలిపారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. 

Mahanadu 2025 : తెలుగుదేశం పార్టీ మూడు రోజులపాటు రాయలసీమలో నిర్వహించిన మహానాడు 2025 ముగిసింది. పార్టీ నాయకుల ప్రసంగాలు, తీర్మానాలు, పార్టీ జాతీయాధ్యక్షుడిగా చంద్రబాబు ఎన్నిక, ప్రమాణస్వీకారం, చివరిరోజు భారీ బహిరంగసభ... ఇలా కడప మహానాడు అట్టహాసంగా సాగింది. వైసిపి అధినేత వైఎస్ జగన్ సొంతజిల్లా, వైసిపి అడ్డాగా చెప్పుకునే కడపలో నిర్వహించిన ఈ మహానాడు సక్సెస్ పై తాజాగా ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు.

టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు, గ్రామస్థాయి నాయకులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కడప మహానాడు అద్భుతంగా జరిగిందని... జిల్లా నాయకత్వమంతా కలిసి పనిచేసి విజయవంతం చేశారన్నారు. సక్సెస్ ఫుల్ గా నిర్వహించిన నేతలకు అభినందనలు.. కార్యకర్తలకు హాట్సాఫ్ చెప్పారు చంద్రబాబు. నాయకులంతా సమిష్టిగా పనిచేస్తే ఏ కార్యక్రమమైనా సజావుగా జరుగుతుందని కడప మహానాడుతో నిరూపితమైందన్నారు.

మంత్రులంతా కార్యకర్తల్లా పనిచేసారని చంద్రబాబు అన్నారు. మహానాడుకు ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రావడం సంతోషాన్నిచ్చిందని... ఇలాగే ప్రజలు నమ్మకం వమ్ముకాకుండా చూడాలన్నారు. మహానాడులో ప్రవేశపెట్టిన ‘నా తెలుగు కుంటుంబం’లోని ఆరు శాసనాల కాన్సెప్ట్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తున్నామని ఈ మహానాడు ద్వారా స్పష్టమైందని చంద్రబాబు అన్నారు.

కేవలం ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలనా నిర్ణయాలపై ప్రజల్లో సానుకూలత ఉందని అర్థమవుతోందన్నారు. ఈ ఏడాది పాలనలో ఏం చేశామో...రాబోయే రోజుల్లో ఏం చేస్తామో మహానాడు ద్వారా వివరించామన్నారు. ఇకపై కూడా ఇలాగే ప్రజలతో నాయకులు మరింత మమేకం కావాలని... ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై నిరంతరం చర్చించేలా చూడాలని చంద్రబాబు సూచించారు.

ప్రతి నెలా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడాకి ప్రజలతో మమేకం కావాలన్న తపనే కారణమని చంద్రబాబు అన్నారు. ఎమ్మెల్యేలు కూడా విధిగా సేవాభావంతో పనిచేయాలని... ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమంలో పాల్గొనాలని చంద్రబాబు సూచించారు.

ఎన్నికల హామీమేరకు జూన్ నెలలోనే మరికొన్ని పథకాలను ప్రారంభించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. స్కూళ్లు ప్రారంభమయ్యేలోపే తల్లికి వందనం, రైతులకు అన్నదాత సుఖీభవ పథకాలు ప్రారంభిస్తామన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించబోతున్నామని చంద్రబాబు స్పష్టం చేసారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా సంక్షేమ కేలండర్‌ను త్వరలోనే ప్రకటిస్తామని చంద్రబాబు ప్రకటించారు.