కూతురు ప్రేమ వివాహం నచ్చని తల్లిదండ్రులు ఆ జంట మీద దారుణంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.

కర్నూలు : ప్రేమించి పెళ్లి చేసుకున్నారని.. అదీ తమకు ఇష్టంలేదని చెప్పినా.. ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారని.. ఆ యువకునిపై అమ్మాయి తండ్రి, బంధువులు పగబట్టారు. వేల కొడవళ్ళు, ఇనుపరాడ్లతో దారికాచి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన గురువారం మండల పరిధిలోని హెచ్ మురవణి నాలుగవ మైలురాయి వద్ద చోటుచేసుకుంది. బాధితురాలు, ఎస్సై శ్రీనివాసులు తెలిపిన వివరాలు ప్రకారం.. హెచ్ మురవణి గ్రామానికి చెందిన ఉసేనీ కూతురు సుకన్య (24). ఆమె గత నిరుడు డిసెంబర్ లో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్టు పద్ధతిలో సిహెచ్ఓ(కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్)గా విధుల్లో చేరింది.

అదే గ్రామానికి చెందిన పెద్ద ఈరన్న కొడుకు వీరేశ్ (28)ను ప్రేమించింది. ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో ఈ ఫిబ్రవరిలో ప్రేమ వివాహం చేసుకుంది. తమ ప్రేమ వివాహం సుకన్య తల్లిదండ్రులకు నచ్చకపోవడంతో.. వీరు అక్కడినుంచి వెళ్లిపోయారు. ఎమ్మిగనూరు పట్టణంలో వేరు కాపురం పెట్టారు. వీరేశ్ తన భార్య సుకన్యను రోజు ఉదయం తన టూవీలర్ మీద తీసుకువచ్చి డ్యూటీ దగ్గర వదిలిపెట్టేవాడు. తిరిగి సాయంత్రం అక్కడినుంచి తీసుకుని వెళ్లేవాడు. గురువారం సాయంత్రం కూడా రోజూలాగే తన భార్యను బైక్ పై తీసుకువెడుతున్నాడు. ఆ సమయంలో అమ్మాయి తండ్రి ఉసేని.. అతని బంధువులు హెచ్ మురవణి నాలుగో మైలురాయి వద్ద టూ వీలర్ ను ఆటోతో ఢీకొట్టారు. 

ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఈ నెల 28న అకౌంట్లలో నగదు జమ.. సీజన్ ముగియకముందే పరిహారం పంపిణీ..

దీంతో ఇద్దరూ కింద పడిపోయారు. వెంటనే వీరేష్ పై విచక్షణారహితంగా వారంతా కలిసి దాడిచేశారు. తమ దాడిలె వీరేశ్ చనిపోయాడనుకుని.. అక్కడి నుంచి పారిపోయారు. ఈ దాడి చూసి సుకన్య భయంతో పరుగులు తీసింది. నేరుగా ఎమ్మిగనూరు రూరల్ పోలీస్స్టేషన్కు చేరుకుంది. పోలీసులకు దాడి విషయం తెలిపింది. ఇంతలో దార్లో వెళ్తున్న కొందరు వీరేశ్ ను గమనించి, గుర్తుపట్టి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేయడంతోపాటు.. వీరేశ్ ను చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. బాధితుడి భార్య సుకన్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.