లోకేష్తో నాకున్న అనుబంధం అలాంటిది.. నువ్వేం చేయలేవ్: జగన్ కు అచ్చెన్న వార్నింగ్
టిడిపిలో విభేదాలు సృష్టించడానికే తప్పుడు వీడియోలు ప్రచారం చేస్తున్నారని కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు.
తిరుపతి: మాజీ సీఎం చంద్రబాబు తనయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ ని ఏపీ టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తిడుతున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై అచ్చెన్నాయుడు స్పందిస్తూ... టిడిపిలో విభేదాలు సృష్టించడానికే తప్పుడు వీడియోలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ వీడియోలో తాను మాట్లాడినట్లుగా వున్న మాటల్లో నిజం లేదన్నారు అచ్చెన్న.
''నువ్వూ, నీ దొంగ సాక్షి ఎన్ని తప్పుడు వీడియోలు వేసినా టిడిపిలో విభేదాలు సృష్టించలేవు జగన్రెడ్డి. టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుగారి నాయకత్వంలో తిరుపతి ఎన్నికకు ఐకమత్యంగా పనిచేస్తుండడంతో నీకు ఓటమి భయం పట్టుకుంది. నారా లోకేష్ విసిరిన సవాల్కి తోకముడిచావు. నిన్న బాబుగారి సభపై రాళ్లేయించావు. ఈ రోజు నా సంభాషణల్ని వక్రీకరించావు. ఎన్ని విషపన్నాగాలు పన్నినా తెలుగుదేశం విజయాన్ని ఆపలేవు. నారా లోకేష్తో నాకున్న అనుబంధాన్ని విడదీయలేవు'' అంటూ అచ్చెన్నాయుడు ట్వీట్ చేశారు.
read more నీలాంటి ఫ్యాక్షన్ కుక్కలు చంద్రబాబును భయపెట్టలేవు: జగన్ పై లోకేష్ ఫైర్
ఇదిలావుంటే నిన్నటి(సోమవారం) టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచార సభలో రాళ్ల దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 12వ తేదీన తిరుపతి పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఓ మహిళ, యువకుడికి స్వల్పగాయాలయ్యాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఈ దాడిని చంద్రబాబునాయుడి డ్రామాగా వైసీపీ కొట్టిపారేసింది. ఓటమి పాలౌతామని భయంతోనే చంద్రబాబునాయుడు ఈ డ్రామాలు ఆడుతున్నారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఈ దాడిని నిరసిస్తూ చంద్రబాబునాయుడు తిరుపతి పట్టణంలో నిరసనకు దిగారు.
తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 324,143,427 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.చంద్రబాబునాయుడు సభపై రాళ్ల దాడి చోటు చేసుకోవడంతో ఈ విషయమై ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేయనుంది. టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్ లు ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు.మరోవైపు ఇదే విషయమై ఫిర్యాదు చేసేందుకు గాను గవర్నర్ ను కలవాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది. తిరుపతి ఉప ఎన్నికకు కేంద్ర బలగాల పర్యవేక్షణలో నిర్వహించాలని టీడీపీ డిమాండ్ చేసింది.