‘ఉక్కు పరిశ్రమ కోసం పోరాడని ప్రజా ప్రతినిధులు సీమ ద్రోహులు’
- ఉక్కు పరిశ్రమ కోసం పోరాడని ప్రజా ప్రతినిధులు రాయలసీమ ద్రోహులంటున్న స్టీల్ ప్లాంట్ సాధన సమితి
- కడప జిల్లాలలో తీవ్రమవుతున్న స్టీల్ ప్లాంట్ ఉద్యమం
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం లో పేర్కొనబడిన కడప ఉక్కు కర్మాగారం కోసం విద్యార్థులు నిరుద్యోగ యువత రాయలసీమ వాదులతో కలిసి స్టీల్ ప్లాంట్ సాధన సమితి ఉద్యమాలు చేస్తున్నా, కనీసం ప్రజా ప్రతినిధుల లో చలనం లేదని , ఉక్కు పరిశ్రమ కోసం పోరాడని ప్రజ ప్రతినిధులు రాయలసీమ ద్రోహులని స్టీల్ ప్లాంట్ సాధన సమితి అధ్యక్షుడు జి.వి.ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రొద్దుటూరు లోని షిరిడీ సాయి జూనియర్ కళాశాల లో రాయలసీమ విద్యార్థి గర్జన పేరుతో స్టీల్ ప్లాంట్ ఉద్యమ ప్రసార కార్యక్రమాన్ని నేడు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ జిల్లాకు సంజీవిని లాంటిది.ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయకుండా 3సంవత్సరాలు కాలయాపన చేస్తున్నా , ఏ ఒక్క ప్రజా ప్రతినిధి పోరాటం చేయకపోవడం దారుణం అన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విభజన చట్టం లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజా ప్రతినిధులు నోరు ఎందుకు తెరవడం లేదో ప్రశ్నించాలని ప్రవీణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. రాయలసీమ లో పుట్టిన ప్రజలు అప్పులతో పుడుతున్నారు..ఆకలితో పెరుగుతున్నారు....చనిపోయి వారి పిల్లలకు అప్పులు పంచి చనిపోతున్నారు. రాయలసీమ లో మనకు త్రాగడానికి నీరు లేదు, తినేదానికి తిండి లేదు,ఇంత దయనీయ స్థితి లో రాయలసీమ ఉంటే రాయలసీమ ప్రజా ప్రతినిధులకు నిద్ర ఎలా వస్తుంది అని ఆయన ప్రశ్నించారు. ప్రజల కష్టాలను తీర్చవలసిన భాద్యత మీ పై లేదా! అని ఆయన మండి పడ్డాడు. ఇకనైనా మీరు ఉక్కు ఉద్యమంలో పాల్గొనక పోతే రాయలసీమ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు,విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మీ పైన యుద్ధం ప్రకటించక ముందే ప్రజా ప్రతినిధులు తమ భాద్యత ను ఎరిగి ఉక్కు పరిశ్రమ కోసం పోరాడాలని విజ్ఞప్తి చేశారు.