లగడపాటి సర్వే: 7 శాతం తగ్గనున్న వైసీపీ ఓట్లు, జనసేనతో వైసీపీకి దెబ్బేనా?
ఏపీలో పరిస్థితులపై లగడపాటి సర్వే
అమరావతి: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి గత ఎన్నికలతో పోలిస్తే సుమారు 7 శాతం ఓట్లను కోల్పోనుంది. అయితే వైసీపీ ఓట్లను జనసేన దక్కించుకొనే అవకాశం ఉందని ఆర్జీ ఫ్లాష్ సర్వే తేల్చింది.
విజయవాడ మాజీ ఎంపీ ఆర్జీఫ్లాష్ టీమ్ తోనే గతంలో పలుమార్లు సర్వేలు నిర్వహించారు. ఎబిఎన్ ఛానెల్ కోసం ఈ టీమ్ సర్వే ను నిర్వహించింది. ఈ సర్వే ఫలితాలను శనివారం సాయంత్రం ఎబిఎన్ విడుదల చేసింది.
2014 ఎన్నికల్లో టిడిపికి 44 శాతానికిపైగా ఉంది. ఇప్పుడు కూడా పెద్దగా మార్పు రాలేదు. 0.86 శాతం మాత్రం తగ్గాయి. వైసీపీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం ఆ పార్టీ ఓట్లలో 7.1 శాతం ఓట్లు కోత పడటం ఖాయంగా కనిపిస్తోంది. అంటే కేవలం 37.46 శాతం మాత్రమే ఆ పార్టీకి వస్తాయ్. ఇక కొత్తగా వచ్చిన పవన్ పార్టీకి 8.90 శాతం ఓట్లు దక్కనున్నాయి.
వైసీపీ ఓట్లను పవన్ పార్టీ చీల్చనుందని ఈ సర్వేతేల్చింది.. ఇక గత ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో 2 శాతానికిపైగా ఓట్లు సాధించింది బీజేపీ. ఇప్పుడు మాత్రం అటు ఇటుగా ఒక్క శాతానికి పరిమితమయ్యే అవకాశం ఉందని తేల్చింది.2009లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ప్రజారాజ్యం, లోక్సత్తా పార్టీలు చీల్చిన ఓట్ల కారణంగా టిడిపి చాలా స్థానాల్లో ఓటమి పాలైంది.అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీ రాష్ట్రంలో జనసేన కూడ ఇదే రకమైన పాత్రను పోషించే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.