పిల్లల ప్రాణాలతో చెలగాటాలొద్దు: టెన్త్ పరీక్షలు రద్దు చేయండి, ఏపీ ప్రభుత్వానికి పవన్ డిమాండ్
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తున్న ప్రస్తుత తరుణంలో పిల్లల ఆరోగ్యాన్ని ఆపదలోకి నెట్టి వారి ప్రాణాలతో చెలగాటం ఆడటం మంచిది కాదని పవన్ ప్రభుత్వానికి సూచించారు
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తున్న ప్రస్తుత తరుణంలో పిల్లల ఆరోగ్యాన్ని ఆపదలోకి నెట్టి వారి ప్రాణాలతో చెలగాటం ఆడటం మంచిది కాదని పవన్ ప్రభుత్వానికి సూచించారు.
తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు దేశంలో ఎక్కడా పరీక్షలు నిర్వహిస్తున్న దాఖలాలు లేవని జనసేన అధినేత గుర్తుచేశారు. డిగ్రీ, పీజీతో పాటు ప్రవేశ, ఉద్యోగ పరీక్షలు సైతం రద్దయ్యాయని పవన్ కల్యాణ్ తెలిపారు.
Also Read:షెడ్యూల్ ప్రకారమే ఏపీలో టెన్త్ పరీక్షలు: తేల్చేసిన మంత్రి సురేష్
జూలై 10 నుంచి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం విద్యార్ధుల తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. పరీక్ష పేపర్లు కుదించినా విపత్కర పరిస్ధితుల్లో నిర్వహించడం శ్రేయస్కరం కాదని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికే రాష్ట్రంలో ఆరు వేలకు పైగా కేసులు నమోదయ్యాయని ప్రజా రవాణా పూర్తి స్థాయిలో అందుబాటులో లేని ఇలాంటి పరిస్ధితుల్లో తల్లిదండ్రుల కోరిక, చిన్నారుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని పవన్ డిమాండ్ చేశారు.
Also Read:తెలంగాణ బాటలోనే తమిళనాడు: టెన్త్ పరీక్షలు రద్దు, పై తరగతులకు విద్యార్థులు ప్రమోట్
పరీక్షల నిర్వహణకు సంబంధించిన విద్యావంతులు, వైద్య నిపుణులతో పలు దఫాలు చర్చించిన తర్వాతే ఈ డిమాండ్ని ప్రభుత్వం ముందుంచుతున్నానని జనసేనాని స్పష్టం చేశారు. ప్రభుత్వం విజ్ఞతతో పిల్లల యోగ క్షేమాలను దృష్టిలో ఉంచుకుని సరైన నిర్ణయం తీసుకుంటుందని పవన్ ఆకాంక్షించారు.