పవన్ కల్యాణ్ వ్యూహం ఇదీ, కీలకం వీరే: జనసేనలో ముత్తా గోపాలకృష్ణ
వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పకడ్బందీ వ్యూహరచనే చేస్తున్నారు.ఈ నెల 14న ప్రకటించనున్న జనసేన ఎన్నికల ముందస్తు ప్రణాళిక ( ప్రీ మేనిఫెస్టో) లోని కొన్ని అంశాలపై పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగిన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (ప్యాక్) చర్చించింది.
హైదరాబాద్: వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పకడ్బందీ వ్యూహరచనే చేస్తున్నారు.ఈ నెల 14న ప్రకటించనున్న జనసేన ఎన్నికల ముందస్తు ప్రణాళిక ( ప్రీ మేనిఫెస్టో) లోని కొన్ని అంశాలపై పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగిన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (ప్యాక్) చర్చించింది.
ఆదివారం ఉదయం హైదరాబాదు మాదాపూర్ లోని పార్టీ కార్యాలయంలో ప్యాక్ సమావేశమైంది. విద్యావ్యవస్థపై పార్టీ పాలసీ కమిటీ రూపొందించిన ముసాయిదా పత్రంపై కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. ఫిన్లాండ్ దేశంలో విజయవంతమైన కొన్ని విద్యా విధానాలు, కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని వాటిని ఆంధ్రప్రదేశ్ లో దశలవారీగా ఎంతవరకు అమలు చేయవచ్చో అధ్యయనం చేయాలనిపవన్ కల్యాణ్ సూచించారు.
అరకు, పాడేరు ప్రాంతాల పర్యటనలో భాగంగా బాలికల వసతి గృహం, పాఠశాలను సందర్శించిన నాటి అనుభవాలను పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. నాణ్యమైన విద్యను అందించడం జనసేన ఆశయమని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వర్గాల వసతి గృహాలు పాఠశాలల్లో నాణ్యత ప్రమాణాలను పెంపొందిచడమే జనసేన లక్ష్యంలో భాగం అన్నారు.
పరిశుభ్రతతో కూడిన పౌష్టికాహారం వసతిగృహంలోని బాలబాలికలకు అందే అంశాన్ని జనసేన మ్యానిఫెస్టో లో చేర్చాలన్నారు. హాస్టల్ గదులు సరైన గాలి, వెలుతురు వచ్చే విధంగా ఉండాలని , మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, దీనితో పాటు బాలికల వసతి గృహాలకు సరైన రక్షణ ఏర్పాట్లు కల్పించాలన్నారు. ఎత్తైన ప్రహారి, హాస్టల్ లోకి ఇతరులు ఎవరు ప్రవేశించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయవలసి ఉందన్నారు.
తన పర్యటనలో అనేక మంది విద్యార్ధులు కలిసిన సంగతి గుర్తు చేస్తూ ఆర్థికంగా వెనుకబడిన వారికి కూడా ప్రభుత్వపరంగా కొన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని విద్యార్ధులు చెప్పినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆర్థికంగా వెనుకబడిన (ఓబీసీ) అగ్రకులాలు, మైనార్టీల పిల్లలకు వసతి గృహాలను ఏర్పాటు చేసే విధంగా జనసేన మేనిఫెస్టో ఉండాలన్నారు.
కీలకం వీరే...
ఏడు జిల్లాలకు జనసేన సంస్థాగత నిర్మాణ కమిటీలు
ఈ రోజు జరిగిన ప్యాక్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లోని ఏడు జిల్లాలకు సంస్థగత నిర్మాణ కమిటీలను నియమించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఈ కమిటీలు ఏర్పాటు చేశారు. అదే విధంగా ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, అమరావతి ప్రాంతాలకు ప్రాంతీయ
కోఆర్డినేటర్లను కూడా ప్యాక్ నియమించింది. ప్రతి జిల్లాకు ఒక కోఆర్డినేటర్, ఇద్దరు జాయింట్ కోఆర్డినేటర్లను ప్యాక్ నియమించింది. విశాఖపట్నం జిల్లాకు మాత్రం అర్బన్ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని నలుగురు జాయింట్ కోఆర్డినేటర్లను నియమించింది.
అదే విధంగా 20 నుంచి 25 మందితో కోఆర్డినేషన్ బృందాన్నికూడా ఏర్పాటు చేసింది. ఇందులో పార్టీకి గత నాలుగున్నరేళ్లుగా సేవలందిస్తున్న వారికి ఎక్కువ శాతం అవకాశం కల్పించాలని పవన్ కల్యాణ్ ప్యాక్ కు దిశానిర్దేశం చేశారు. మిగిలిన జిల్లాలకు కమిటీలను త్వరలోనే నియమించనున్నారు.
ఈ అన్ని జిల్లాలకు కన్వీనర్ గా పార్థసారధి వ్యవహరిస్తారు. ప్రాంతీయ కోఆర్డినేటర్లగా ఉత్తరాంధ్రకు యువ పారిశ్రామికవేత్త, సైంటిస్టు డాక్టర్ శ్రీనుబాబు, ఉభయగోదావరి రీజియన్ కు శ్రీ కలువకొలను తులసీ రావు, కృష్ణా రీజియన్ కు ముత్తంశెట్టి కృష్ణారావు, గుంటూరు రీజియన్ కు బైరా దిలీప్ లను నియమించారు.
అదే విధంగా శ్రీ కాకుళం జిల్లాకు కో ఆర్డినేటర్ గా డాక్టర్ బోడ్డేపల్లి శ్రీరాంమూర్తి, జాయింట్ కో ఆర్డినేటర్లుగా శ్రీమతి పాలవలస యశస్విని, శ్రీమతి సుజాత పండా, విజయనగరం జిల్లాకు కోఆర్డినేటర్ గా శ్రీ లోకం ప్రసాద్ (మిరాకిల్ ), జాయింట్ కోఆర్డినేటర్లుగా గంపా గిరిధర్ , శ్రీ గడబాల అప్పారావు, విశాఖ జిల్లా కోఆర్డినేటర్ గా డాక్టర్ అశోక్ యాదవ్ , జాయింట్ కో ఆర్డినేటర్లుగా శ్రీ కోన తాతారావు , డాక్టర్ సునిథి, శ్రీ సీహెచ్ వెంకటరామయ్య, శ్రీ మండవ రవిలను నియమించారు.
తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ గా మేడా గురుదత్ ప్రసాద్, జాయింట్ కోఆర్డినేటర్లుగా పెసంగి ఆదినారాయణ, శెట్టిబత్తుల రాజబాబు. పశ్చిమగోదావరి జిల్లా కోఆర్డినేటర్ ఎర్రంకి సూర్యారావు, జాయింట్ కోఆర్డినేటర్లుగా కనకరాజు సూరి, యర్రా నవీన్, కృష్ణా జిల్లా కోఆర్డినేటర్ గా డేవిడ్ రాజు, జాయింట్ కోఆర్డినేటర్లుగా గద్దె తిరుపతి రావు, పోతిన మహేష్, గుంటూరు జిల్లా కోఆర్డినేటర్ గా ఎం. రాధాకృష్ణమూర్తి, జాయింట్ కోఆర్డినేటర్లుగా శ్రీ సయ్యద్ బాబు, శ్రీ చిల్లపల్లి శ్రీనివాసులను ప్యాక్ నియమించింది. ఈ సమావేశానికి శ్రీ పవన్ కల్యాణ్ అధ్యక్షత వహించారు.
ఈ సమావేశంలో ప్యాక్ కన్వీనర్ మాదాసు గంగాధరం, తోట చంద్రశేఖర్, అర్హం యూసుఫ్, మారిశెట్టి రాఘవయ్య, రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్, అశోక్ , శ్రీ మహేందర్ రెడ్డి , శంకర్ గౌడ్ పాల్గొన్నారు.
జనసేనలో చేరనున్న మాజీమంత్రి ముత్తా గోపాలకృష్ణ
మాజీమంత్రి ముత్తా గోపాలకృష్ణ ఆదివారం తన కుమారులు శ్రీ శశిధర్, శ్రీ గౌతమ్ లతో కలిసి మాధాపూర్ లోని జనసేన కార్యాలయాన్ని సందర్శించారు. గౌతమ్ ఆధ్వర్యంలో ప్రారంభం అవుతున్న ఇండియా ఏ హెడ్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ లో ఒక కార్యక్రమాన్ని శ్రీ పవన్ కల్యాణ్ హోస్ట్ గా రూపకల్పన చేశామని, ఆ కార్యక్రమంలో చేయడానికి అంగీకరించాల్సిందిగా వారు పవన్ కల్యాణ్ ను కోరారు.
ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే ఈ టీవీ షోను చేయడానికి పవన్ కల్యాణ్ అంగీకారం తెలిపారు. అదే విధంగా అపార రాజకీయ అనుభవం ఉన్నముత్తా గోపాల కృష్ణ జనసేనలోకి రావాల్సిందిగా పనన్ కల్యాణ్ చేసిన కోరగా అందుకు ఆయన సమ్మతించారు.
ముత్తా గోపాలకృష్ణ అనుభవం జనసేనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జనసేన అధినేత శ్రీ పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ముత్తా గోపాలకృష్ణకు స్థానం కల్పిస్తామని చెప్పారు. ఆయన తన పెద్ద కుమారుడు శశిధర్ తో కలిసి కొద్ది రోజుల్లోపార్టీలో చేరనున్నారు.