అధికార పార్టీలోని కుమ్ములాటలు, అసమ్మతి, ప్రభుత్వంపై వ్యతిరేకత జగన్ కు కలిసి వచ్చే అవకాశాలు ఎటూ ఉన్నాయి. అయితే, సదరు వ్యతిరేకత అంతా జగన్ కు పూర్తి అనుకూలంగా ఉంటుందా అని చెప్పటం మాత్రం కష్టం.

ముందస్తు ఎన్నికల సూచనల్లో భాగంగా వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికల కసరత్తును ప్రారంభించినట్లే కనబడుతోంది. ముందుగా బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై జగన్ దృష్టి సారించినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఒక అంచనా ప్రకారం 60 నియోజకవర్గాల్లో పార్టీ బలహీనంగా ఉంది. 175 నియోజకవర్గాల్లోని 60 నియోజకవర్గాల్లో పార్టీ బలహీనంగా ఉందంటే చిన్న విషయం కాదు కదా?

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మొన్నటి ఎన్నికల్లో 175 నియోజకవర్గాలకు గాను పార్టీ గెలిచెంది 67 చోట్లే. అంటే మిగిలిన 108 నియోజకవర్గాల్లో పార్టీకి గట్టి అభ్యర్ధులు లేనట్లే. అదేవిధంగా గెలిచిన 67 ఎంఎల్ఏల్లో 21 మంది పార్టీ ఫిరాయించారు. ఇపుడు అక్కడ కూడా ప్రత్యమ్నాయం వెతుక్కోవాల్సిందే కదా? మిగిలిన 46 ఎంఎల్ఏలకు మళ్ళీ టిక్కెట్లు ఇస్తారనుకున్నా 129 నియోజకవర్గాల్లో అయితే గట్టి అభ్యర్ధులను చూసుకోవాల్సిందే. అయితే, పోయిన ఎన్నికల్లో అనేక అంశాలు కలిసి వచ్చి టిడిపి, భాజపా అభ్యర్ధులు గిలిచారు. వీరిలో సుమారు వెయ్యి ఓట్ల మెజారిటితో గెలిచిన వారే అత్యధికులు. అంటే పోయిన ఎన్నికల్లో కొద్దిగా నిర్లక్ష్యం వహించిన కారణంగానే వైసీపీ అభ్యర్ధులు ఓటమిపాలయ్యారన్నది వాస్తవం.

ఈ పరిస్ధితుల్లో జగన్ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై దృష్టి సారించారు. రాయలసీమలోని 53 నియోజకవర్గాల్లో కనీసం 15 నియోజవర్గాల్లోనూ, ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల్లోని 15 చోట్ల పార్టీ బలహీనంగా ఉంది. అదేవిధంగా కోస్తా ప్రాంతంలోని మిగిలిన స్ధానాల్లో 30 చోట్ల పార్టీకి చెప్పుకోతగ్గ అభ్యర్ధులు లేరు. అందుకనే ఇపుడున్న ఇన్ఛార్జిలను బలోపేతం చేయటంతో పాటు వారికి ప్రత్యామ్నాయాలు చూడాలని కూడా జగన్ యోచిస్తున్నట్లు సమాచారం. అందుకనే ఇతర పార్టీల్లోని గట్టి అభ్యర్ధుల కోసం వెతుకుతున్నారు. పోయిన ఎన్నికల్లో పార్టీ గట్టిగా దెబ్బతిన్న పశ్చిమగోదావరి జిల్లాతో పాటు అనంతపురం, రాజధాని జిల్లాలైన గుంటూరు, కృష్ణా జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు పార్టీ వర్గాలు సమాచారం.

అదే సమయంలో పలు నియోజకవర్గాల్లో అధికార పార్టీలోని కుమ్ములాటలు, అసమ్మతి, ప్రభుత్వంపై వ్యతిరేకత జగన్ కు కలిసి వచ్చే అవకాశాలు ఎటూ ఉన్నాయి. అయితే, సదరు వ్యతిరేకత అంతా జగన్ కు పూర్తి అనుకూలంగా ఉంటుందా అని చెప్పటం మాత్రం కష్టం. అందుకనే టిడిపిని ధీటుగా ఎదుర్కొనే అభ్యర్ధులను అన్నీ నియోజకవర్గాల్లోనూ నిలపాలన్నదే జగన్ లక్ష్యంగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయ్.