68 నియోజకవర్గాపైనే గురి...
- వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా రెండంచెల వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
- ఒకటేమో జనాలు ప్రధానంగా తటస్తులను వైసీపీ వైపు ఆకర్షించటం.
- రెండోది టిడిపి కంచుకోటలుగా ప్రసిద్ధి చెందిన నియోజకవర్గాలను బద్దలు కొట్టటం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా రెండంచెల వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఒకటేమో జనాలు ప్రధానంగా తటస్తులను వైసీపీ వైపు ఆకర్షించటం. రెండోది టిడిపి కంచుకోటలుగా ప్రసిద్ధి చెందిన నియోజకవర్గాలను బద్దలు కొట్టటం. పనిలో పనిగా ఫిరాయింపు ఎంఎల్ఏల నియోజకవర్గాలపైన కూడా దృష్టి సారిస్తారనుకోండి అది వేరే సంగతి.
పోయిన ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన 67 మంది ఎంఎల్ఏల్లో 21 మంది టిడిపిలోకి ఫిరాయించిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి నుండి ఆ ఎంఎల్ఏలంటే జగన్ కు బాగా మంటగా ఉంది. నంద్యాల ఉపఎన్నికలో గెలుపుకు జగన్ చేసిన ప్రయత్నమే అందుకు ఉదాహరణ. సరే, మొన్నటి ఉపఎన్నికంటే ప్రత్యేక పరిస్ధితిల్లో జరిగింది కాబట్టి జగన్ ఎంత ప్రయత్నం చేసినా గెలుపు సాధ్యం కాలేదు. సాధారణ ఎన్నికల్లో పరిస్ధితులు వేరేగా ఉంటుంది. ప్రతీ నియోజకవర్గంపైనా మొన్న నంద్యాలలో దృష్టి పెట్టినట్లు చంద్రబాబునాయుడుకు సాధ్యం కాదన్న విషయం అందరికీ తెలిసిందే.
అందుకనే ఫిరాయింపు ఎంఎల్ఏల నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్ధులను రంగంలోకి దింపాలని జగన్ నిర్ణయించారు. అందుకే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిషోర్ బృందంతో ప్రత్యేకంగా సర్వేలు చేయిస్తున్నారు. అదే సందర్భంలో టిడిపికి మొదటి నుండి కంచుకోటలుగా నిలుస్తున్న నియోజకవర్గాలపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇపుడున్న 175 నియోజకవర్గాల్లో టిడిపికి 47 నియోజకవర్గాలు కంచుకోటలుగా నిలుస్తున్నాయన్న విషయం తెలిసిందే.
టిడిపి పెట్టిన 1983 నుండి 2014 ఎన్నికల వరకూ కూడా పై 47 నియోజకవర్గాల్లో పార్టీ ఓడిపోయింది మహా ఉంటే ఒకటి రెండు సార్లు మాత్రమే. మిగిలిన అన్నీ ఎన్నికల్లోనూ టిడిపి అభ్యర్ధులు నామినేషన్ వేస్తే చాలు గెలుపే. ఆ ఒకటి రెండు సార్లు కూడా వైఎస్ హయాంలోనే. అదే ఫలితాన్ని వచ్చే ఎన్నికల్లో తిరిగి రాబట్టాలని జగన్ గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. టిడిపి కంచుకోటలను గనుక ఎంత వీలైతే అంత బద్దలు కొట్టగలిగితే 2019 ఎన్నికల్లో విజయం పెద్ద కష్టం కాదని జగన్ భావిస్తున్నారు. అందుకు తగ్గట్లే ప్రశాంత్ కిషోర్ ఒకటికి రెండుసార్లు టిడిపి అభ్యర్ధుల బలం, బలహీనతలతో పాటు వైసీపీ నుండి ఫీల్డ్ చేయాల్సిన అభ్యర్ధులపైన కూడా జాగ్రత్తగా సర్వే చేస్తున్నారట. చూడాలి ఏం జరుగుతుందో?