ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్తాన్ ఆర్మీ దాడిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందిన విషయం తెలిసిందే. మురళీ అంత్యక్రియలు ఆదివారం ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. ఈ అంత్యక్రియలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమ్ మంత్రి వంగలపూడి అనిత, మంత్రులు నారా లోకేష్తో పాటు తదితరులు పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే తాజాగా వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మురళీ నాయక్ చేసిన త్యాగాన్ని గుర్తు చేస్తూ, ఆయన బలిదానం సమాజానికి ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.
వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ, మురళీ నాయక్ దేశ సేవలో ప్రాణత్యాగం చేసిన సంగతి ప్రతి భారతీయుడి గుండెను తాకే విధంగా ఉందన్నారు. ‘‘ఆయన చేసిన త్యాగానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా,’’ అని అన్నారు.
మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రూ. 25 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ చర్య మురళీ కుటుంబానికి కొంతమేర భరోసా ఇస్తుందన్నారు.

జవాన్లు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే రూ. 50 లక్షల ఆర్థిక సాయం అందించే విధానాన్ని గతంలో వైసీపీ ప్రభుత్వం ప్రారంభిచిందని జగన్ గుర్తు చేశారు. ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా అదే విధానాన్ని కొనసాగించిందని తెలిపారు. జవాన్ల త్యాగాన్ని గౌరవించే విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వారి కుటుంబాలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు.


