రాజు గారు...బిజెపి ఎంఎల్ఏనా లేక టిడిపినా ?
- పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించినందుకు చంద్రబాబు పేరు చిరస్ధాయిగా నిలిచేపోయేలా తీర్మానం చేయాలన్నారు బిజెపి ఎంఎల్ఏ రాజు
‘పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి పేరు చిరస్ధాయిగా నిలిచిపోయేట్లు అసెంబ్లీలో ఒక తీర్మానం చేయాల్సిన అవసరం ఉంది’... అసెంబ్లీ మొదలైన సందర్బంగా శుక్రవారం ఉదయం సభలో ఓ సభ్యుడు చేసిన సూచన. ఇంతకీ ఆ సభ్యుడు ఎవరా అని ఆలోచిస్తున్నారా? టిడిపి సభ్యుడు కాదు లేండి. మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు. సభ్యుడు చేసిన సూచనతో భాజపా నేతలే ఆశ్చర్యపోతున్నారు. అసలు విష్ణు తమ పార్టీ ఎంఎల్ఏనా లేక మిత్రపక్షమైన టిడిపి సభ్యుడా అన్న సందేహం మొదలైంది.
ఎందుకంటే, విష్ణు ఎప్పుడెలా మాట్లాడుతారో ఎవరికీ తెలీదు. ఒకసారి చంద్రబాబు ప్రభుత్వం మొత్తం అవినీతిమయమైపోయిందంటారు. ఇంకోరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండబట్టే రాష్ట్రంలో ఈమాత్రమైనా అభివృద్ది జరుగుతోందంటారు. ఒకసారేమో ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలున్నాయంటారు. ఇంకోరోజు వైసీపీ అనవసర రద్దాంతం చేస్తోందని మండిపడతారు.
ఇదంతా ఎందుకంటే, పట్టిసీమ ప్రాజెక్టు వృధా అంటూ భాజపా నేతలే మైకులు పగలిపోయేట్లు విమర్శించారు. పట్టిసీమ ప్రాజెక్టులో బోలెడంత అవినీతి జరిగిందని మీడియా సమావేశాల్లో ఆరోపించారు. అంతటి ఆగకుండా జాతీయ నాయకత్వానికి కూడా అనేక ఫిర్యాదులూ చేసారు. దానికితోడు పట్టిసీమ ప్రాజెక్టులో సుమారు రూ. 400 కోట్ల అవినీతి జరిగిందని సాక్ష్యాత్తు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వ్యాఖ్యలు చేసింది.
అంటే, పట్టిసీమ చుట్టూ ఇన్ని వివాదాలు ముసురుకుంటే, అదే పార్టీకి చెందిన విష్ణు మాత్రం పట్టిసీమ నిర్మించినందుకు చంద్రబాబు పేరు చిరస్ధాయిగా నిలిచిపోవాలని సూచించారు. రాజు చేసిన సూచనతో భాజపా నేతలే ఆశ్చర్యపోతున్నారు. పట్టిసీమ నిర్మించకపోయుంటే 13 లక్షల ఎకరాలకు సాగు నీరందేదే కాదన్నారు రాజుగారు. సరే, పనిలో పనిగా వైసీపీ పైన కూడా విమర్శలు చేసారులేండి. చివరకు పట్టిసీమ ఉపయోగాలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టును చేపట్టిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పారు విష్ణుకుమార్ రాజు.