ఈ సిట్టింగులపై వేటు తప్పదా ?
- జిల్లాలోని ఐదుగురు ఎంఎల్ఏలను త్వరలో తన ఇంటికి భోజనానికి పిలిపించాలని చంద్రబాబునాయుడు నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్ర రాజకీయాలకు కేంద్రబిందువు అయిన కృష్ణా జిల్లాలో వచ్చే ఎన్నికల్లో పలువురు టిడిపి సిట్టింగులకు టిక్కెట్లు దక్కే అవకాశాలు లేవని సమాచారం. జిల్లాలోని ఐదుగురు ఎంఎల్ఏలను త్వరలో తన ఇంటికి భోజనానికి పిలిపించాలని చంద్రబాబునాయుడు నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విషయం బయటకు పొక్కటంతో భోజనం వ్యాఖ్యలు అధికార పార్టీలో ప్రకంపనలు రేపుతున్నాయి. చంద్రబాబు భోజనం పెట్టి ఇంటికి పంపే లిస్టులో ఐదుగురు సిట్టింగులతో పాటు మరో ఇద్దరు మాజీలున్నారట.
కృష్ణా జిల్లాలో ఫస్ట్ పడే వికెట్ నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యదేనట. ఉప ఎన్నికల్లో గెలిచిన సౌమ్యకు ఇప్పటికీ నియోజకవర్గంలో పట్టులేదట. ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం పెద్ద మైనస్ గా చెబుతున్నారు. అందుకే ఆమె బదులుగా అక్కడ ఓ సమర్థుడైన వ్యక్తిని దింపాలని చంద్రబాబు నిర్ణయించారట. ఇక పెడన ఎమ్మెల్యే, సీనియర్ నేత కాగిత వెంకట్రావును అనారోగ్య కారణాలతో తప్పించనున్నారు.
ఇక పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనది మరో సమస్య. ఆమె భర్తకు బాపట్ల ఎంపీ సీటు ఇచ్చి ఆమె స్ధానంలో వర్ల రామయ్య లేదా మాజీ ఎమ్మెల్యే డీవై.దాస్ ఎవరో ఒకరికి ఇవ్వవచ్చని అంటున్నారు. ఇక పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వరుసగా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. కాల్మనీ కేసులు, కోడి పందేలు ఇతరత్రా సెటిల్మెంట్లు ఆయనకు మైనస్. ఇక్కడి నుండి లోకేష్ పోటీ చేస్తాడని కూడా పార్టీలో ప్రచారం జరుగుతోంది.
ఇక విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమ చుట్టు వివాదాలు ముసురుకుంటున్నాయి. ఆయనకు మంత్రి పదవి రానప్పుడు కాపుల గొంతు కోశారు అని బాబునే టార్గెట్ చేసేలా మాట్లాడడం కూడా ఉమాకు పెద్ద మైనస్. ఇక నియోజకవర్గంలో రాజకీయాలు, సెటిల్మెంట్లు, ఆయన కుమారులు వివాదాలు, తాజాగా ఆయన భార్యపై కేసు నమోదవ్వటం లాంటివి ఉమకు పెద్ద మైనస్ అవుతోంది. ఇక వీరితో పాటు గుడివాడ ఇన్చార్జి రావి వెంకటేశ్వరరావుతో పాటు తిరువూరులో ఇప్పటికే మూడుసార్లు ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసును కూడా పక్కన పెట్టేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.