తమిళనాడుః గేమ్ ప్లాన్ ఇంకా పూర్తి కాలేదు
ఒకసారి ప్రభుత్వం కూలిపోతే, ప్రభుత్వ పగ్గాలు మొత్తం కేంద్రప్రతినిధి గవర్నర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. నరేంద్రమోడికి కావాల్సిందే అదికదా?
తమిళనాడులో ఓ కోయిల ముందే కూసింది. ఇపుడు పళని స్వామి పరిస్ధితి అలాగే ఉంది. బలపరీక్ష వరకూ ఆగకుండానే తన ప్రమాణస్వీకారంతో పాటు మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేయటమే సమస్యగా మారింది. తానొక్కడే ప్రమాణస్వీకారం చేసి ఉంటే ఇపుడింత సమస్య ఉండేది కాదేమో. మంత్రివర్గంలో చోటు దక్కుతుందని పలువురు పళనికి మద్దతు తెలిపారు. అయితే, మంత్రివర్గం కూర్పు మొత్తం శశికళ చెప్పినట్లే జరిగింది. తమకు మంత్రిపదవులు రాలేదని తెలిసిన మరుక్షణం నుండే చాలా మంది ఎంఎల్ఏలు మండిపోతున్నారు.
సిఎంగా నియమితులైన పళనికి గవర్నర్ బలనిరూపణకు 15 రోజుల గడువిచ్చారు. మంత్రివర్గ ఏర్పాటును అప్పటి వరకూ ఆపివుంటే బాగుండేదని విశ్లేషకుల అభిప్రాయం. బలపరీక్ష తర్వాతే మంత్రివర్గం ఏర్పాటవుతుందని పళని చెప్పివుంటే అందరూ తప్పనిసరిగా పళనికే మద్దతు పలికేవారు. శశికళ చెప్పినట్లే మంత్రివర్గం ఏర్పడినా పదవులు రానివారు అప్పుడు చేయగలిగేది కూడా ఏమీ ఉండేది కాదు. ఎందుకంటే, ఒకసారి బలనిరూపణ పరీక్షలో గట్టెక్కితే మళ్ళీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే కనీసం 6 మాసాల సమయం అవసరం. ఈ లోపున ఎన్ని డెవలప్మెంట్లు జరుగుతాయో ఎవరికి తెలుసు?
అయితే ఇపుడేమైంది? మంత్రిపదవులు దక్కని వారంతా వ్యతరేకమయ్యారు. అంటే, తమకు భవిష్యత్తులో మంత్రిపదవులు రావని కన్ఫర్మ్ చేసుకున్నవారంతా ఎదురుతిరిగి పన్నీర్ వైపెళ్లిపోతున్నారు. దాంతో ఇపుడు పళని ప్రభుత్వ భవితవ్యంపై సందేహాలు ఏర్పడ్డాయి. పదిమంది ఎంఎల్ఏలు వ్యతిరేకంగా ఓటు వేస్తే చాలా పళని ప్రభుత్వం కూలిపోతుంది. ఆ అవకాశాలే బాగా కనబడుతున్నాయి. ఒకసారి ప్రభుత్వం కూలిపోతే, ప్రభుత్వ పగ్గాలు మొత్తం కేంద్రప్రతినిధి గవర్నర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. నరేంద్రమోడికి కావాల్సిందే అదికదా?