నారాయణ కళాశాలల్లో  పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు చర్యలు తీసుకొని మంత్రి గంటా

విద్యార్థుల ఆత్మహత్యలపై మంత్రి గంటా ఎన్నిసార్లు విచారణ జరిపిస్తారు? ఒకవైపు ఆయన విచారణ జరపాలని అధికారులను ఆదేశిస్తూనే ఉన్నారు.. మరోవైపు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇదంతా ఒక ప్రహసనంలా తయారైంది. అసలు ఒక్క నారాయణ కాలేజీలోనే ఎందుకు ఇంత మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? అసలు అధికారులు చర్యలు తీసుకుంటున్నారా? ఈ ప్రశ్నలు బాధితులను వెంటాడుతున్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తాజాగా కడపలోని నారాయణ కళాశాలలో పావని అనే వ్యిద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ ఈ సంఘటనపై విచారణ జరపాలని’ కడప జిల్లా జాయింట్ కలెక్టర్ కు ఆదేశించారు. విద్యార్థిని ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అని తెలియగానే.. మంత్రి గారికి కోపం వచ్చిందట. అందుకే విచారణ జరిపించాలంటూ ఆవేశంగా అధికారులను ఆదేశించారు. ఆలా చెప్పగానే..ఆయన కోపం పాలమీద పొంగులా వెంటనే తగ్గిపోతుంది కూడా.

ఎందుకంటే.. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడున్నర ఏళ్లలో ఇప్పటి వరకు దాదాపు 60మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అదీ కూడా నారాయణ కళాశాలల్లోనే కావడం గమనార్హం. అలా విద్యార్థి ఎవరైనా చనిపోయారని తెలియగానే.. వెంటనే విచారణ జరిపించాలని చెప్పడం మంత్రి గంటాకు అలవాటైపోయింది. అధికారులకు కూడా ఆ ఆదేశాలు వినడం అలవాటైంది. అంతకు మించి అక్కడ ఏమీ జరగడం లేదు. ఇప్పటి వరకు ఏ ఒక్క విద్యార్థి ఆత్మహత్య ఘటనపై చర్యలు తీసుకుంది లేదు. సాధారణంగా ఇలాంటి ఘటనలు కాలేజీల్లో జరిగితే వెంటనే వాటిని మూసేయడమో, యాజమాన్యం మీద చర్యలు తీసుకోవడమో చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం అలాంటివి జరగడం లేదు. ఇప్పటివరకు నారాయణ సంస్థలకు చెందిన ఒక్క కాలాజీ క్యాంపస్ ని మూసి వేయలేదు. కనీసం ఇంఛార్జి, లెక్చిరర్ లపై కూడా చర్యలు తీసుకోలేదంటే పరిస్థితి ఎలాఉందో అర్థమైపోతోంది.

ఇలా ఎందుకు జరుగుతోంది అంటే.. ఆ నారాయణ విద్యా సంస్థల ఛైర్మన్ నారాయణ .. మంత్రి గంటా శ్రీనివసరావుకి స్వయానా వియ్యంకుడు. అందుకే ఏం జరిగినా.. మీడియా ముందు ఆవేశంగా రెండు ముక్కలు మాట్లాడి.. తర్వాత ఆసంగతే మర్చిపోతున్నారు. కనీసం సీఎం అయినా దీనిపై చర్యలు తీసుకోవచ్చు కదా అంటే.. గంటా, నారాయణ .. ఇద్దరు ఆయనకు చాలా కావలసిన వారు. కాపు వర్గంలో మంచి పేరున్న వారిని దూరం చేసుకుంటే తనకు ఓట్లు ఎక్కడ పోతాయో అని భయం అందుకే ఆయన కూడా పట్టించుకోరు. అందుకే నానాటికీ విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయే తప్ప.. తగ్గడం లేదు.