Kumari Aunty: కుమారి ఆంటీకి పోలీసుల తిప్పలు.. వీడియో వైరల్
కుమారి ఆంటీ ఫుడ్ ట్రక్ బిజినెస్ వల్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడటంత పోలీసులు ఆమె వ్యాపారాన్ని నిలిపేశారు. దీంతో ఆమె ఆందోళనగా ఓ ఇంటర్వ్యూలో ఇతర ఫుడ్ ట్రక్లకు అవకాశం ఇస్తున్నా తమనే ఎందుకు అనుమతించడం లేదు అంటూ పేర్కొన్నారు.
Food Truck Business: హైదరాబాద్లో రోడ్డు పక్కన ఫుడ్ ట్రక్లో భోజనం పెడుతూ దాసరి సాయి కుమారి అలియాస్ కుమారి ఆంటీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యారు. ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ వీడియోలు, చాలా చోట్ల ఆమెనే కనిపించారు. భోజనం వడ్డించి బిల్లులు అడుగుతున్న వీడియోలే. ఆమె చాలా సంపాదించిందని, ఆ బిజినెస్ గురించి కూడా పుంఖానుపుంఖాలుగా వీడియోలు వచ్చాయి. అనతి కాలంలోనే అనూహ్యంగా ఫేమస్ అయ్యారు.
తొలుత టేస్ట్ బాగుందని ఆమె ఫుడ్ ట్రక్ వద్ద భోజనాలు చేయగా.. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారని, అక్కడి ఫుడ్ ఎలా ఉందో ఓ సారి చూడాలని కూడా చాలా మంది వెళ్లి భోజనం చేసి డబ్బులు ఇచ్చి వచ్చారు. అయితే.. ఏది అతి అయినా అది మంచిది కాదు అన్నట్టుగా ఇవాళ ఆమె ఫేమస్ కావడమే బిజినెస్కు ఆటంకంగా మారిపోయింది.
Also Read: Kumari Aunty: వైసీపీ ప్రచారంలో సోషల్ మీడియా ఫేమ్ కుమారి ఆంటీ.. ఆమె ఏమన్నారంటే?
ఆమె ఫుడ్ ట్రక్ వద్ద చాలా మంది గుమిగూడారని, ట్రాఫిక్కు అంతరాయం కలుగుతున్నదని పోలీసులు ఆమె ఫుడ్ ట్రక్ను మూసేశారు. తాజాగా మీడియాతో ఆమె కనిపించిన వీడియోలో ఇదే ఆందోళనను వ్యక్తపరిచారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆమె ఫుడ్ ట్రక్ బిజినెస్ను నిలిపేయడంపై ఆందోళన వ్యక్తపరిచారు. గంటలు గడిచిపోతున్నా తమ వ్యాపారాన్ని కొనసాగించనివ్వరే అని బాధపడ్డారు. ఇతర ఫుడ్ ట్రక్ వ్యాపారం సజావుగా సాగుతున్నా.. కేవలం తన ఫుడ్ ట్రక్ బిజినెస్ను మాత్రమే ఎందుకు అడ్డుకున్నారా? అని సంశయించారు. గతంలో కూడా ఇలా ట్రాఫిక్ కారణాల వల్ల తన బిజినెస్ను ఆపినా.. మళ్లీ వెంటనే కొనసాగించడానికి అనుమతించేవారని గుర్తు చేసుకున్నారు. చాలా మంది కస్టమర్లు ఆకలితో ఆహారం కోసం తన వద్దకు వచ్చారని, కానీ, పోలీసుల జోక్యంతో వారంతా అసంతృప్తితో వెనుదిరిగిపోతున్నారని తెలిపారు. ఇటీవలే ఆమె సీఎం జగన్ ప్రభుత్వం తమకు ఇల్లు ఇచ్చిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన వీడియో వైరల్ అవుతున్నది.