తమ్ముళ్ళకు కోర్టు షాక్
సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన రవాణా కమీషనర్ పై టిడిపి ప్రజాప్రతినిధుల దురుసుప్రవర్తనను చంద్రబాబు ఒక్క క్షమాపణతో సర్దుబాటు చేసేద్దామనుకున్నారు. అయితే అందుకు కోర్టు అంగీకరించకుండా విచారణకు స్వీకరించటం గమనార్హం.
తమ్ముళ్ళకు కోర్టు షాక్ ఇచ్చింది. ఇటీవలే రవాణాశాఖ కమీషనర్ బాలసుబ్రమణ్యంపై టిడిపి నేతలు దురుసుగా ప్రవర్తించిన సంగతి తెలిసందే కదా? విజయవాడ ఎంపి కేశినేని నాని, ఎంఎల్ఏ బోండా ఉమ, ఎంఎల్సీ బుద్దా వెంకన్న తదితరులు బహిరంగంగానే కమీషనర్, డిప్యుటి కమీషనర్ తదితరులను అందరిముందూ దుర్భాషలాడారు. అంతేకాకుండా కమీషనర్ భద్రతా సిబ్బందిపై చేయి కూడా చేసుకున్నారు. ఆ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎప్పుడైతే ఘటన వెలుగు చూసిందో వెంటనే చంద్రబాబునాయుడు రంగంలోకి దిగారు.
సదరు ఘటనను మీడియా పెద్దగా హైలైట్ చేయకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ప్రజాప్రతినిధులకు, చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. దాంతో సిఎం కలగజేసుకుని మరుసటి రోజు కమీషనర్ కు ప్రజాప్రతినిధులతో సారి చెప్పించారు. స్వయంగా చంద్రబాబే కలగచేసుకోవటంతో కమీషనర్ కూడా ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది. అయితే, బాధితుడు కమీషనర్ మౌనంగా ఉండిపోయినా కోర్టు మాత్రం అలా చూస్తూ ఊరుకోలేదు. జరిగిన ఘటనను సీరియస్ గా తీసుకుంది.
ప్రభుత్వ ఉన్నతాధికారిపై దురుసు ప్రవర్తనను సూమోటోగా తీసుకుని బాధ్యులైన ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. వెంటనే 11 మందిపై కేసు నమోదు చేసింది. ఈరోజు అందరికీ నోటీసులు జారీచేసింది. జరిగిన ఘటనపై నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని నోటీసులో పేర్కొంది. సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన రవాణా కమీషనర్ పై టిడిపి ప్రజాప్రతినిధుల దురుసుప్రవర్తనను చంద్రబాబు ఒక్క క్షమాపణతో సర్దుబాటు చేసేద్దామనుకున్నారు. అయితే అందుకు కోర్టు అంగీకరించకుండా విచారణకు స్వీకరించటం గమనార్హం.