కె ఇ శ్యాంబాబుకు ఊరట
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబుకు హైకోర్టులో ఊరట లభించింది. వైసిపి నాయకుడు లక్ష్మీనారాయణరెడ్డి హత్య కేసులో డోన్ కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారంట్పై హైకోర్టు స్టే విధించింది.
గతేడాది మే 21న లక్ష్మీనారాయణ రెడ్డి హత్యకు గురైన సంగతి అందరికీ తెలిసిందే. ఎఫ్ఐఆర్ లో శ్యాంబాబు, జడ్పీటీసీ సభ్యురాలు కప్పట్రాళ్ల బొజ్జమ్మను నిందితులుగా పేర్కొని దర్యాప్తు చేసిన పోలీసులు వారి ప్రమేయం లేదని తేల్చారు.
అయితే ఈ కేసులో దర్యాప్తు సరిగా జరగలేదని శ్యాంబాబు, బొజ్జమ్మతో పాటు కృష్ణగిరి ఎస్సై నాగతులసీ ప్రసాద్పై కూడా విచారణ జరపాలంటూ నారాయణ రెడ్డి భార్య శ్రీదేవి డోన్ కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఫిర్యాదును విచారణకు స్వీకరించిన డోన్ న్యాయస్థానం వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
డోన్ కోర్టు విచారణకు విచారణకు స్వీకరించడాన్ని, ఎన్బీడబ్ల్యూ జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ శ్యాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు డోన్ కోర్టు ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.