*విజయవాడలో ఫ్లెక్సీ కలకలం* టీడీపీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీ* బీజేపీ నేతల పనేనని టీడీపీ నేతల వాదన

విజయవాడ నగరంలో టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. టీడీపీకి వ్యతిరేకంగా వెలసిన ఓ ఫ్లెక్సీ నగరంలో కలకలం రేపింది. దీంతో ఫ్లెక్సీ ఏర్పాటుపై అధికార పార్టీ నేతలకు సమాచారం అందడం.. అనంతరం మున్సిపల్‌ సిబ్బందితో వాటిని తొలగించడం చకాచకా జరిగిపోయాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇంతకీ ఆ ఫ్లెక్సీలో ఏముందంటే..

కేంద్రం ఇచ్చిన స్పెషల్‌ ప్యాకేజీ నిధులు తీసుకుంటూ.. యూ టర్న్‌ తీసుకొని మళ్లీ హోదానే కావాలని అడగటంలో ఆంతర్యం ఏమిటో 5 కోట్ల ఆంధ్రులకు తెలుసులే!.. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులలో వేల కోట్ల రూపాయల అవినీతి జరగడం నిజం కాదా?.. తెలుగు దేశం తమ్మూళ్లూ.. పోలవరం, పట్టిసీమ, రాజధాని భూముల కేటాయింపులపై సీబీఐ విచారణ కోరదామా? కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇళ్లు ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల దగ్గర నుంచి అధిక డబ్బులు వసూలు చేయడం ఎంత వరకు కరెక్టు!.. కాల్‌ మనీ కేసుల విచారణ ఏమైంది..? ఎన్నికల సమయంలో ఇచ్చిన 600 హామీలు ఏమయ్యాయి తెలుగుదేశం తమ్మూళ్లూ! కులాల మధ్య చిచ్చు పెట్టింది మీరు కాదా తెలుగు దేశం తమ్మూళ్లూ?’ అని 5 కోట్ల మంది ఆంధ్రులు అని భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

కాగా.. ఈ ఫ్లెక్సీలను బీజేపీ నేతలే కావాలని టీడీపీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే.. ఈ ఘటనపై బీజేపీ నేతలు ఎవరూ స్పందించకపోవడం గమనార్హం. బీజేపీ మిత్ర పక్షం నుంచి టీడీపీ బయటకు వచ్చిన నాటి నుంచి ఇరు పార్టీల నేతలు ఒకరిని మరొకరు విమర్శించుకుంటన్న సంగతి తెలిసిందే.