ఉద్యోగులకు జీతాలు టైంకి రావు.. మహిళలు ధైర్యంగా తిరగలేరు , ప్రజల వల్లే ఏపీకి ఈ ఖర్మ : అశోక్ గజపతి
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్ధితులకు ప్రజలే కారణమని టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు ఆరోపించారు. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే అమ్మాయిలు వణికిపోతున్నారని.. రైతుల ఆత్మహత్యలు కూడా ఎక్కువయ్యాయని అశోక్ ఆరోపించారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు. శుక్రవారం విజయనగరం కలెక్టరేట్ వద్ద ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ‘‘ఇదేం ఖర్మ’’ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...జగన్ పాలనలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయన్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే అమ్మాయిలు వణికిపోతున్నారని.. రైతుల ఆత్మహత్యలు కూడా ఎక్కువయ్యాయని అశోక్ ఆరోపించారు. ఏపీకి ఇలాంటి ఖర్మను ప్రజలే తీసుకురావడం దురదృష్టకరమని.. ప్రజల సొమ్మును దోచుకుని జైలుకు వెళ్లొచ్చిన వారికి అధికారం అప్పగించడం ఖర్మకాకపోతే ఏంటని ఆయన ప్రశ్నించారు. జైలుకు వెళ్లొచ్చిన ప్రతి వ్యక్తి మహాత్మా గాంధీ కాదని.. జీతాలను కూడా సకాలంలో పొందలేకపోవడం ఉద్యోగుల ఖర్మేనంటూ అశోక్ గజపతి రాజు దుయ్యబట్టారు.
అంతకుముందు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో 175 సీట్లలో గెలుస్తామంటున్న జగన్.. దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. బీసీ, దళిత వర్గాలను సీఎం నమ్మించి మోసం చేశారని .. నవరత్నాల పేరుతో రాష్ట్రానికి నవ బొక్కలు పెట్టారని విమర్శించారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం ద్వారా 2 కోట్ల మంది ప్రజలను రాబోయే రోజుల్లో తెలుగుదేశ పార్టీ కలుస్తుందని బొండా ఉమ తెలిపారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాలతోనే పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబును వెళ్లకుండా అడ్డుకుంటున్నారని బొండా ఉమా ఆరోపించారు.
Also REad:తాడేపల్లిగూడెంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా పోస్టర్లు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు..
ఇక సంకల్ప సిద్ధి స్కాంలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీల హస్తం వుందని ఆరోపించారు. ఈ స్కాం చాలా పెద్దదని.. ఈ కుంభకోణంలో ఎమ్మెల్యే వంశీ, ఆయన అనుచరుడి పాత్రను బయటపెట్టాలని బొండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో సెక్స్ స్కాం కూడా వుందని.. కాలేజీ విద్యార్ధినులను వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దీని వెనుకా వైసీపీ నేతల హస్తం వుందని ఉమా ఆరోపించారు.