తప్పు సరిదిద్దుకోవాలి.. తప్పుడు కేసులు కాదు: జగన్పై నిమ్మకాయల మండిపాటు
వైసీపీ అధికారంలోకి వచ్చాక సామాన్య ప్రజలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయన్నారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప
వైసీపీ అధికారంలోకి వచ్చాక సామాన్య ప్రజలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయన్నారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప. ఆదివారం పత్రిక విడుదల చేసిన ఆయన.. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తి స్ధాయిలో అదుపుతప్పాయని విమర్శించారు.
సామాన్య ప్రజల నుంచి టీడీపీ కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులపై వైసీపీ నాయకులు, కార్యకర్తల దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని నిమ్మకాయల విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 13 నెలల్లోనే 800 మంది టీడీపీ కార్యకర్తలపై దాడులు చేశారని.. 11 మందిని హత్య చేశారని ఆయన ఎద్దేవా చేశారు.
Also Read:ఒక్కరూపాయి జీతగాడి సోకులే రాష్ట్ర బడ్జెట్ సరిపోనంతా!: జగన్ పై అయ్యన్న సెటైర్లు
వైసీపీ నేతల వేదింపుల తట్టుకోలేక ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారని... రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని చినరాజప్ప మండిపడ్డారు. ఇప్పటి వరకు మహిళలు, చిన్నారులపై సుమారు 210 అత్యాచారాలు జరిగాయని, వైసీపీ పాలనలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఎద్దేవా చేశారు.
వైసీపీ పాలనలో ప్రజలకు స్వేచ్చ లేకుండా పోయిందని... అంబేద్కర్ రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు కష్టపడి రాజ్యాంగం రచించి ప్రజలకు వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన హక్కును కల్పిస్తే జగన్ సీఎం అయిన మొదటిరోజే వాటిని హరించివేశారని చినరాజప్ప ఆరోపించారు.
Also Read:తాడేపల్లి రాజప్రసాదంలో కరెంట్, కుర్చీల కోసమే రూ.4కోట్లు: బుద్దా వెంకన్న
ముఖ్యమంత్రి పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని.. ఓ వైపు వైసీపీ అవినీతిని, అక్రమాలను ప్రశ్నిస్తున్న టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని నిమ్మకాయల దుయ్యబట్టారు.
మరోవైపు ప్రభుత్వ వైఫల్యాల్ని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెడుతున్నారని.. తప్పులు ఎత్తిచూపితే సరిదిద్దుకోవాలి కానీ తప్పుడు కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసమని నిమ్మకాయల ప్రశ్నించారు.