పవన్ టార్గెట్ అదేనా ?
- వచ్చే ఎన్నికల్లో కీలకమైన కాపు సామాజిక వర్గాన్ని మళ్ళీ చంద్రబాబునాయుడు వైపు మళ్ళించటమే పవన్ కల్యాణ్ లక్ష్యంగా కనబడుతోంది
వచ్చే ఎన్నికల్లో కీలకమైన కాపు సామాజిక వర్గాన్ని మళ్ళీ చంద్రబాబునాయుడు వైపు మళ్ళించటమే పవన్ కల్యాణ్ లక్ష్యంగా కనబడుతోంది. శుక్రవారం విజయవాడలో పవన్ మాటలు అనుమానాలకు ఊతమిస్తున్నాయి. పోయిన ఎన్నికల్లో వివిధ కారణాల వల్ల కాపు సామాజికవర్గం తెలుగుదేశంపార్టీకి మద్దతు ప్రకటించింది. గతంలో జరిగిన ఏ ఎన్నికలో కూడా కాపులు గంపగుత్తగా టిడిపికి మద్దతు పలికిన దాఖలాలు లేవు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ కారణమన్న ఆగ్రహం, పవన్ కల్యాణ్ మద్దతిచ్చాడన్న ఉద్దేశ్యంతో కాపుల్లో అత్యధికులు చంద్రబాబుకు మద్దతు ఇచ్చారు. సరే, దానికితోడు కాపులను బిసిల్లోకి చేరుస్తానన్న హామీ టిడిపికి బోనస్ అయ్యింది.
అయితే, ఎన్నికల తర్వాత గద్దెనెక్కిన చంద్రబాబునాయుడు ఏం చేసారో అందరికీ తెలిసిందే. ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కాపు ఉద్యమం మొదలవ్వటం, పలు సందర్భాల్లో ఉద్రిక్తతకు దారితీయటం, చంద్రబాబు అణిచివేస్తూనే పలువురిపై కేసులు పెట్టటం, ముద్రగడపై వేధింపులు అందరికీ తెలిసిందే. ఇటువంటి కారణాలతో కాపుల్లో ప్రధానంగా ఉభయగోదావరి జిల్లాల్లో చంద్రబాబుపై మండిపోతున్నారు. అందుకే పోయిన ఎన్నికల్లో లాగ వచ్చే ఎన్నికల్లో కాపుల మద్దతు టిడిపికి దక్కేది అనుమానమే.
అదేసమయంలో పార్టీలో ఉన్న కాపు నేతలను నమ్ముకుంటే ఉపయోగం లేదని చంద్రబాబుకు అర్ధమైనట్లుంది. ఎందుకంటే, టిడిపిలో ఉన్న కాపు నేతలకన్నా చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాపునేతలే ఎక్కువ. ఒకవేళ ఎన్నికల సమయానికి కాపుల్లో వ్యతిరేకత మరింత పెరిగితే చంద్రబాబు పుట్టి ముణగటం ఖయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకనే చంద్రబాబు ముందు జాగ్రత్తగా పవన్ ను రంగంలోకి దింపారు. వచ్చే ఎన్నికలపై పవన్ గందరగోళంలో ఉన్నట్లు పైకి కనబడుతున్నా, అంతర్గతంగా మాత్రం చేయాల్సిన ‘అజెండా’ విషయంలో పూర్తి అవగాహనతోనే ఉన్నట్లు సమాచారం.
అంతర్గత అజెండా ఏంటంటే, చంద్రబాబుకు దూరమైన కాపు సమాజికవర్గాన్ని మళ్ళీ దగ్గర చేయటమే పవన్ అజెండా అన్నది స్పష్టం. శుక్రవారం పవన్ మాట్లాడిన మాటలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ‘ రాజధాని జిల్లాల్లోని కులాలు ఐక్యంగా ఉంటేనే అమరావతి నిర్మాణం బ్రహ్మాండంగా ముందుకు సాగుతుంద’ని చెప్పటంలో ఉద్దేశ్యం అందే. ఇక్కడ కులాలు అంటే కృష్ణ జిల్లాలో కాపు సామాజికవర్గానికి బలమైన బేస్ ఉంది. అధికారం మొత్తం కామ్మ సామాజికవర్గం చేతిలో ఉంది. పోయిన ఎన్నికల్లో కన్నా కృష్ణ, గుంటూరు జిల్లాల్లో వైసిపి ఇపుడు బలపడింది. కాబట్టే వచ్చే ఎన్నికల్లో కాపుల ఓట్లు టిడిపివైపు ఏకపక్షంగా ఉండదన్నది స్పష్టం. అందుకనే పవన్, చంద్రబాబుకు మద్దతుగా రంగంలోకి దిగారు.