ధర్మవరంలో జగన్ ఫుల్లుఖుషి....ఎందుకో తెలుసా ?
- వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ ఫుల్లు ఖుషీ అయిపోయారు.
వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ ఫుల్లు ఖుషీ అయిపోయారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జగన్ అనంతపురం జిల్లాలో తిరుగుతన్న విషయం తెలిసిందే. పాదయాత్రలో భాగంగా జగన్ ధర్మవరం నియోజకవర్గంలో ఉన్నారు. ధర్మవరం అనగానే అందరికీ గుర్తుకువచ్చేది ముందు పట్టుచీరలే కదా? ధర్మవరం పట్టుచీరలు దేశవ్యాప్తంగా ఎంత ఫేమస్సో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
పాదయాత్రలో భాగంగా జగన్ తమ నియోజకవర్గంలోకి వచ్చారని చేనేత నిపుణులు తెలుసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం స్ధానిక యూనియన్ కు సంబంధించిన కొందరు జగన్ ను కలిసారు. అక్కడే జగన్ లో పట్టరాని సంతోషం కనిపించింది. ఒక్కసారిగా జగన్లో అంత సంతోషం ఎందుకంటారా? కొందరు చేనేత నిపుణులు ప్రత్యేకమైన పట్టుదారాలతో రెండు రంగుల్లో పట్టు శాలువాలను తయారు చేసారు. ఆ శాలువాలనే వారు జగన్ కు బహూకరించారు.
ఆ శాలువాలను చూడగానే జగన్ మొహం ఒక్కసారిగా వికసించింది. శాలువాల్లో జగన్ నిలువెత్తు రూపంతో పాటు విశాఖపట్నంలో ప్రకటించిన నవరత్నాలను కూడా పొందుపరిచారు. శాలువాలపై జగన్ నిలువెత్తు రూపంతో పాటు నవరత్నాల హామీలను కూడా నేయటమంటే మామూలు విషయం కాదు. అదే విషయమై నిపుణులు వివరిస్తూ నెలన్నరోజులు కష్టపడి ప్రత్యేకమైన శాలువాలను నేసినట్లు జగన్ తో చెప్పారు. 3 వేల కిలోమీటర్ల పాదయాత్రకు నైతిక మద్దతుగా తాము ప్రత్యేకమైన శాలువాను నేసినట్లు వారు చెప్పగానే జగన్ ఫుల్లు ఖుషీ అయిపోయారు. జగన్ మాట్లాడుతూ, వైసిపి అధికారంలోకి రాగానే చేనేతల సమస్యలు పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు.