Asianet News TeluguAsianet News Telugu

బిగ్ మిస్టేక్...రూ. 1400కోట్లకు బదులు రూ.2,800కోట్లు జమ: దేవినేని ఉమ సీరియస్

 రాజ్యాంగపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి, మంత్రులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

devineni uma demands finance minister buggana resign
Author
Vijayawada, First Published Aug 13, 2020, 7:23 PM IST

విజయవాడ: రాజ్యాంగపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి, మంత్రులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఆ శాఖలోని అధికారులు బాధ్యతమరిచి ప్రవర్తించడం వల్ల ప్రజల సొమ్ము దుర్వినియోగమైందని ఆరోపించారు.   

గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆర్థికమంత్రి బుగ్గన అసమర్థత, ఆ శాఖకు చెందిన అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం వల్ల జూలై30న పెన్షన్లకు సంబంధించి రూ.2800కోట్లు డైరెక్ట్ గా ఎన్జీవోల అకౌంట్లలోకి వెళ్లిపోయాయని, రూ.1400కోట్లకు బదులు రూ.2,800కోట్లను అధికారులు బదిలీ చేశారని దేవినేని పేర్కొన్నారు.  చివరకు తప్పు తెలుసుకొని ఆ సొమ్ముని వెనక్కు రప్పించడానికి ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి నానా అగచాట్లు పడ్డారన్నారు.

రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఆ శాఖ అధికారుల బాధ్యతా రాహిత్యం వల్ల చాలా సీరియస్ క్రైమ్ జరిగిందని...అందుకు బాధ్యత వహిస్తూ మంత్రి బుగ్గన తక్షణమే తన మంత్రిపదవికి రాజీనామా చేయాలని, జరిగిన తప్పిదంపై ముఖ్యమంత్రి ప్రజలకు వివరణ ఇవ్వాలని ఉమా డిమాండ్ చేశారు. 

కంటెంట్ పేమెంట్ పద్ధతిని కాదని, బ్యాకెండ్ పేమెంట్లు చేయడం వల్లే ఇంత పెద్దపొరపాటు జరిగిందన్నారు. 14 నెలల్లో రూ.2లక్షలకోట్ల వరకు చెల్లింపులు జరిగితే, వాటిలో డైరెక్ట్ పేమెంట్స్ ఎంత చేశారు, బ్యాకెండ్ పేమెంట్స్ ఎంతచేశారనే వివరాలు వెల్లడించాలన్నారు.  అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆర్థిక శాఖ నుంచి వెళ్లిపోయిన డబ్బు తిరికివెనక్కు వస్తుందా? అని దేవినేని నిలదీశారు. 

read more   అసంపూర్తే: రాష్ట్ర విభజనపై జగన్ సర్కార్ సంచలన వాదన

చిత్తూరు జిల్లాకు చెందిన కాంట్రాక్టర్లకు కూడా గతంలో ఒకసారి ఇదేమాదిరి డబుల్ పేమెంట్స్ చేశారన్నారు.  రాష్ట్ర ప్రజలు తమకష్టంతో కట్టే పన్నుడబ్బులను, ఇష్టమొచ్చినట్లు దుర్వినియోగం చేస్తారా? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం వచ్చాక 14నెలల్లో కాంట్రాక్టర్లకు ఎన్నివందలకోట్ల సొమ్ము చెల్లించారో చెప్పాలన్నారు.   సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలతోనే ఆర్థికశాఖ నుంచి అడ్డగోలు చెల్లింపులు జరుగుతున్నాయన్నారు. 

ప్రభుత్వం ఇచ్చిన చీకటి జీవో2430 వల్ల అధికారులెవరూ మీడియాకు సమాచారం ఇవ్వడం లేదన్నారు. పెన్షన్ డబ్బు రెండుసార్లు పడ్డాయనే వార్తలు వచ్చాకే ఈ వ్యవహారం బయటకు వచ్చిందన్నారు. బడ్జెట్ సమావేశాల్లో ఇలాంటి చీకటి వ్యవహరాలు బయటపడతాయనే ముఖ్యమంత్రి  బడ్జెట్ ను మండలికి రాకుండా చేశారన్నారు. కరోనా నిబంధనల సాకుతో బడ్జెట్ పై చర్చలేకుండా,  గవర్నర్ తో సంతకాలు పెట్టించి ఆడిట్ లేకుండా, ప్రతిపక్షాలకు బడ్జెట్ లెక్కలు ఇవ్వకుండా ప్రభుత్వం మమ అనిపించిందని ఉమా ఆక్షేపించారు. 

స్పెషల్ సెక్రటరీగా ఉన్న సత్యనారాయణ, ప్రభుత్వ పెద్దలతో లాలూచీ వ్యవహారాలు నడిపి తన తమ్ముడు శ్రీనివాసరావుని ఆర్థికశాఖలో ప్రోగ్రామ్ మేనేజర్ గా నియమించారని, ఇద్దరు ప్రోగ్రామ్ మేనేజర్లకు ఆదేశాలివ్వడం వల్లే రూ.1400కోట్లు ఖజానా నుంచి తరలిపోయాయన్నారు. ఫైనాన్స్ సెక్రటరీ రావత్ దీనిపై నోరు విప్పాలని, ఇంతపెద్ద క్రైమ్ కి బాధ్యులైన వారిని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని దేవినేని డిమాండ్ చేశారు. 

ట్రెజరీ కోడ్, స్టేట్ ఫైనాన్స్ ఎకౌంటబులిటీ కోడ్ ని కాదని ప్రజల సొమ్ముని దోచేస్తున్నారన్న ఉమా పాలకులు అసమర్థులై, వారికి అనుభవం లేనప్పుడే ఇటువంటివి జరుగుతాయన్నారు. 

కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించలేని ప్రభుత్వం చివరకు చనిపోయినవారి మృత దేహాలను మానవత్వం లేకుండా, దారుణంగా ట్రాక్టర్లలో, జేసీబీల్లో, రిక్షాల్లో తరలిస్తోందన్నారు. జగన్ ఆర్భాటంగా ప్రారంభించిన అంబులెన్సులన్నీ ఏమయ్యాయన్నారు.  

రాజధానికోసం 240 రోజులుగా జరుగుతున్న ఉద్యమాన్ని పాలకులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు.  అమరావతి ఉద్యమంలో మృతిచెందిన బీసీ మహిళ వరగాని నాగేంద్రమ్మను ప్రభుత్వం బతికిస్తుందా? అని నిలదీశారు. రాజధానికి భూములిచ్చిన 29వేల రైతు కుటుంబాలక సక్రమంగా కౌలు చెల్లించాలన్న ఇంగితం కూడా ప్రభుత్వానికి లేకుండా పోయిందన్నారు. ముఖ్యమంత్రి జగన్, మంత్రి బొత్స ఆ పని ఎందుకు చేయడం లేదని ఉమా ప్రశ్నించారు. ప్రభుత్వం సక్రమంగా కౌలు చెల్లించి ఉంటే నాగేంద్రమ్మ మరణించేది కాదన్నారు. 

రేపు హైకోర్టులో రాజధానిపై విచారణ ఉంటే ముఖ్యమంత్రి ఈరోజు ఏఎమ్ఆర్డీఏ పై సమీక్ష నిర్వహించడం ఏమిటన్నారు. వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసే దేవేందర్ రెడ్డి, ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ  అమరావతి ఉద్యమంపై, మహిళలపై అసభ్యంగా, దుర్మార్గంగా పోస్ట్ లు పెడుతున్నాడని దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవేందర్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని ఉమ డిమాండ్ చేశారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios