బెజవాడ కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్... గుట్టు రట్టు చేసిన పోలీసులు
మొగల్రాజపురంలో ఆచార్య ప్లే స్కూలులో క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలిసి దాడి చేసినట్లు డీసీపీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు.
విజయవాడ: బెజవాడ కేంద్రగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అన్ లైన్ లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మ్యాచ్ పై ఓ ముఠా భారీగా బెట్టింగ్ లు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ ముఠా బెజవాడలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో దాడిచేసిన పోలీసులు నిర్వహకులను అదుపులోకి తీసుకోవడమే కాకుండా కంప్యూటర్లతో సహా ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను డీసీపీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. మొగల్రాజపురంలో ఆచార్య ప్లే స్కూలులో క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలిసిందని అన్నారు. అవతార్ అనే యాప్ ద్వారా ఈ బెట్టింగ్ నడిపిస్తున్నారని... బాగా తెలిసిన వాళ్ళ ద్వారానే ఈ బెట్టింగ్ యాప్ లో ఆడతారన్నారు. దాదాపు 12 లక్షల వరకూ బెట్టింగ్ జరుగుతోందని సమాచారం రావడంతో దాడి చేశామన్నారు.
read more పంజాబ్ వర్సెస్ ఢిల్లీ: భావి భారత కెప్టెన్ ను నిర్ణయించే పోరు
పరారీలో వున్న ప్రధాన సూత్రధారి నవీన్ ను త్వరలో అదుపులోకి తీసుకుంటామని డిసిపి తెలిపారు. ఈ దాడుల్లో బెట్టింగ్ ఎక్విప్మెంట్ మొత్తం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఐపీఎల్ రోజుల్లో పోలీసులకు బెట్టింగ్ పై సమాచారం ఇచ్చి ప్రజలు సహకరించాలని సూచించారు. ఈ వ్యాలెట్ ద్వారా నగదు వ్యవహారాలు చేస్తున్నారని...విద్యార్ధులు ఇలాంటి బెట్టింగ్ లకు ఆకర్షితులు కావద్దని డిసిపి కోరారు.