రాహూల్ పట్టాభిషేకానికి ముహూర్తం ఫిక్స్
- కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించే ముహూర్తం ఖరారైంది.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించే ముహూర్తం ఖరారైంది. ఏఐసిసి అధ్యక్ష ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు చేశారు. డిసెంబర్ 1 నుంచి ఈ ఎన్నికల ప్రక్రియ జరగనుంది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన సోమవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పై నిర్ణయం జరిగింది. సోనియా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ 1న నోటిఫికేషన్ జారీ అవుతోంది.
డిసెంబర్ 4న నామినేషన్లు స్వీకరిస్తారు. డిసెంబర్ 16న జరుగనున్న ఎన్నికల్లో విజేతను 19వ తేదీన ప్రకటిస్తారు. అయితే రాహుల్ గాంధీకి పోటీగా మరెవరూ నామినేషన్ దాఖలు చేయకపోతే నామినేషన్ల పరిశీలన రోజే అధ్యక్షనిగా రాహుల్ను ప్రకటించేస్తారు. కాగా డిసెంబర్ 5న రాహుల్ ఏకగ్రీవ ఎన్నిక జరుగుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొత్త అధ్యక్షునిగా రాహుల్ బాధ్యతలు చేపట్టడం ఖాయంగా తెలుస్తోంది. 2013 నుండి రాహుల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే.