చిరంజీవి కాంగ్రెస్ వాడే ... ఇంకా బాల్ ఆయన కోర్టులోనే..: మాజీ కేంద్రమంత్రి
ప్రముఖ సినీనటులు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి తిరిగి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు చింతా మోహన్ కోరారు. ఇప్పుడు ఆయన రాజకీయంగా మంచి అవకాశం వుందన్నారు.
![Congress Leader Chita Mohan invites Chiranjeevi to Andhra Pradesh Politics AKP Congress Leader Chita Mohan invites Chiranjeevi to Andhra Pradesh Politics AKP](https://static-ai.asianetnews.com/images/01h8dkx9z51fw9hxdxead3hbsm/chiru--4--jpg_363x203xt.jpg)
అమరావతి :వైఎస్ షర్మిల ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు మారాయి. ఇప్పటివరకు వైసిపి, టిడిపి-జనసేన కూటమి మధ్య ద్విముఖ పోరు వుంటుందనుకుంటే షర్మిల ఎంట్రీతో త్రిముఖ పోరుగా మారింది. షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీలో కూడా జోరు పెరిగింది. ఇంతకాలం మౌనంగా వున్న కాంగ్రెస్ నాయకులు యాక్టివ్ అవుతున్నారు. ఇలా మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ అయితే ఏకంగా కాంగ్రెస్ పార్టీకి ఏపీలో 130 అసెంబ్లీ, 20 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేసారు.
ఆంధ్ర ప్రదేశ్ లో అధికారానికి కాంగ్రెస్ చేరువ అవుతోంది... కాబట్టి కాపు సామాజికవర్గం ఎటువైపు వుండాలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చింతా మోహన్ సూచించారు. ప్రజల్లో వస్తున్న మార్పును, కాంగ్రెస్ గాలిని చూసయినా కాపులు దగ్గర కావాలన్నారు. చాలాకాలంగా రాజ్యాధికారం కావాలంటున్న కాపులకు ఇది మంచి అవకాశమని అన్నారు. గతంలో సినీ హీరో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి చివరకు కాంగ్రెస్ పార్టీలో కలిపేసారని ... ఇప్పటికీ ఆయనకు కాంగ్రెస్ సభ్యత్వం వుందని మాజీ మంత్రి తెలిపారు. ఇలా చిరంజీవి కాంగ్రెస్ సభ్యుడే కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయాలని ... ఇలాంటి అద్భుత అవకాశాన్ని వాడుకోవాలని సూచించారు.
వీడియో
ఇలా చిరంజీవిని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ కాపులను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేసారు చింతా మోహన్. ఇక రాజకీయంగా యాక్టివ్ కావాలో వద్దో అన్నది చిరంజీవి నిర్ణయించుకోవాలి... ప్రస్తుతం బాల్ ఆయన కోర్టులో వుందన్నారు. ఈ సమయంలో చిరంజీవి వస్తే కాంగ్రెస్ పార్టీతో పాటు ఆయనకు లాభం వుంటుందని మాజీ కేంద్రమంత్రి తెలిపారు.
Also Read జగన్ రెడ్డి అంటే నచ్చట్లేదా?... మరి అలా అనమంటారా సుబ్బారెడ్డి గారు? : వైఎస్ షర్మిల
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా మార్పు కనిపిస్తోందని... ప్రజల్లో పరివర్తన కనిపిస్తోందని చింతా మోహన్ అన్నారు. వైసిపి పాలనలో రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయిందని ప్రజలు గుర్తించారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి చివరకు వైన్ షాపుల్లో పనిచేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఉద్యోగాలు లేవు... వ్యాపారాలు చేద్దామంటే సాయంచేసు ఎస్సీ, ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లు మూసేశారు... తమను పట్టించుకునేవారు లేక నిరుపేద బిడ్డలు విలవిల్లాడిపోతున్నారని అన్నారు. ప్రస్తుతం ముస్లిం, క్రైస్తవులే కాదు ఉద్యోగులు, మేధావులు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అన్నారు.