ప్రత్యేక హోదా వదలం, మన అవసరం వస్తుంది: వైఎస్ జగన్
కేంద్రంలో ఉన్నవారు ఏదో ఒకరోజు మన మీద ఆధారపడే రోజు వస్తోంది ఆ రోజునే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యమౌతోందని ఏపీ సీఎం వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు.
అమరావతి: కేంద్రంలో ఉన్నవారు ఏదో ఒకరోజు మన మీద ఆధారపడే రోజు వస్తోంది ఆ రోజునే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యమౌతోందని ఏపీ సీఎం వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు.గురువారం నాడు మన పాలన- మీ సలహా అనే కార్యక్రమంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు.
also read:ఏడాదిలో 90 శాతం హామీలు నెరవేర్చాం: ఏపీ సీఎం వైఎస్ జగన్
ఇప్పుడు కాకపోయినా..రేపైనా కేంద్రానికి మన అవసరం ఉంటుంది. ఆ రోజున మన డిమాండ్లను సాధించుకొంటామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాను విడిచిపెట్టబోమని ఆయన తేల్చి చెప్పారు. మనం ఏదైనా చెబితే మాటల్లో నిజాయితీ ఉండాలన్నారు సీఎం జగన్.ఏదైతే చేయగలుగుతామో అదే విషయాన్ని చెబుతామని ఆయన స్పష్టం చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా వచ్చుంటే పరిశ్రమలకు రాయితీలు వచ్చుండేవన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన మాట తప్పారని ఆయన పరోక్షంగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు.
గత ప్రభుత్వం చెప్పినట్టుగా నేను మాటలు చెప్పనన్నాను. ఎయిర్ బస్సు, మైక్రోసాఫ్ట్, హైపర్ లూస్ అని మాటలు చెప్పను అని ఆయన చెప్పారు. గ్రాఫిక్స్ చూపించి అన్యాయం చేయలేనన్నారు. 20 లక్షల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలంటూ ఉత్త ప్రచారం చేసుకోలేనని ఆయన పరోక్షంగా బాబు సర్కార్ పై విమర్శలు గుప్పించారు.
ఏ రాష్ట్రానికి లేని సహాజ వనరులు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. పరిశ్రమలకు డబ్బులు చెల్లించకుండానే ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకొన్నారని బాబు సర్కార్ పై ఆయన విమర్శలు చేశారు.ఇదంతా మీడియాను మేనేజ్ చేయడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం అవినీతికి దూరంగా ఉందన్నారు. తమది సుస్థిర ప్రభుత్వమని ఆయన చెప్పారు. దేశంలోనే నాలుగో అతి పెద్ద పార్టీ అని ఆయన చెప్పారు.
భూములు ఇచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత పారిశ్రామికవేత్తలపై ఉందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సానుకూల వాతావరణం ఉందన్నారు. పరిశ్రమలకు భూములు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు,. పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వ పెద్దల చేతులు తడపాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.