అమరావతి ఫాస్ట్ ట్రాక్ నిర్మాణం కోసం ’ టార్గెట్ 2016’ కాన్సెప్ట్ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలే కాదు, గళ్లు, చర్చిలు, మసీదులు కూడా నిర్మిస్తారు పదెకరాలలో హస్తకళల గ్రామం అమరావతి ప్రత్యేక ఆకర్షణ
నవంబరు ఒకటో తేదీ నుంచి అమరావతి నగర నిర్మాణ పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధికారులకు సూచనలిచ్చారు. 2018 నాటికి అమరావతి నిర్మాణం పూర్తి చేసేందుకు ‘టార్గెట్ 2018’ అనే కాన్సెప్ట్ తో పనులు ప్రారంభించాలని, పరిపాలన నగరం, ఇతర మౌలిక సదుపాయాల పనులను ఆరంభించి వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు.
అమరావతి ప్రభుత్వ భవన సముదాయ నిర్మాణం, ఇతర అంశాలను బుధవారం నాడు ఆయన సమీక్షించారు.ప్రభుత్వ భవనాల కాంప్లెక్స్ నిర్మాణ పనులను ప్రారంభించడం ద్వారా అమరావతి నగర నిర్మాణానికి ఒక ఊపు, రూపు రావాలని ఆయన చెప్పారు.
“ప్రకాశం బ్యారేజ్కు ఇవతల వున్న కొండపై దుర్గమ్మ వుంది, అవతలి కొండపై బుద్ధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసే ఆలోచన వుంది. రాజధాని కేవలం పరిపాలన కేంద్రంగా నే కాకుండా సంపూర్ణ నగరంగా ఉంటుంది. అధ్యాత్మిక వాతావరణం సృష్టించేందుకు టీటీడీ వేంకటేశ్వర ఆలయం, ఇస్కాన్ కృష్ణ మందిరంతో పాటు మసీదు, చర్చిల నిర్మాణం కూడా జరుగుతుంది,” అని ఆయన చెప్పారు
వీటితో పాటు అమరావతిలో పది ఎకరాల విస్తీర్ణంలో హస్తకళల గ్రామం ఏర్పాటుచేస్తామని, దీని ఏర్పాటుకు కొంతమంది మహిళలు ముందుకొచ్చారని కూడా సిఎం చెప్పారు.రాష్ట్రంలో చేతివృత్తులపై జీవనం సాగిస్తున్న అందరినీ భాగస్వాముల్ని చేస్తూ గొప్ప ఆకర్షణీయ పర్యాటక ప్రాంతంగా హస్తకళల గ్రామం రొపొందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశాభావం వ్యక్తంచేశారు.
రాజధానిలో నిర్మించే భవంతులు, కట్టడాలకు ఏకరూపత వుండాలి, వాటి నిర్మాణశైలి, ఆకృతుల్లో ఆంధ్రప్రదేశ్ కళలు, బౌద్ధ సంస్కృతులు ప్రతిబింబించేలా చూడాలని కూడా ఆయన సూచించారు.
