చంద్రబాబు తనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బ్రాండ్ అని, తన పాలనకు స్పష్టమైన ఫలితాలు ఉన్నాయని తెలిపారు. ఆరోగ్యం, పర్యాటకం, వ్యవసాయం రంగాల్లో ప్రణాళికలపై వివరించారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తానే బ్రాండ్ అని, తన పనితీరుకి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పెట్టుబడుల కోసం రాష్ట్రాన్ని నమ్మి వచ్చిన పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అందించే సౌకర్యాలే కాదు, తమ నడక విధానమే ప్రత్యేకమైందని తెలిపారు.పరస్పర పోటీలో అన్ని రాష్ట్రాలు ప్రోత్సాహకాల మీద దృష్టి పెడుతున్నప్పటికీ, సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌కి అనుసరించే దారిలో తాను ముందున్నానని ఆయన తెలిపారు. 

రాష్ట్రంలో వైద్య రంగంలో భారీ మార్పులు తీసుకొచ్చేందుకు బిల్ గేట్స్ ఫౌండేషన్ తో కలిసి ఒక నియోజకవర్గంలో ఆరోగ్య సేవలను జూన్ నెల 15న ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రపంచ స్థాయి శిక్షణతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో వైద్య వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. తొలి దశ విజయవంతమైతే, రెండు సంవత్సరాల్లో రాష్ట్రమంతటా విస్తరిస్తామని చెప్పారు.

స్వర్ణ చతుర్భుజ పథకానికి..

రాష్ట్రం అభివృద్ధికి ప్రభుత్వం డబ్బు లేకపోయినా మార్గం చూపించగలదని చెన్నై-నెల్లూరు మధ్య నిర్మించిన హైవేను ఉదాహరణగా పేర్కొన్నారు. అదే ప్రాజెక్ట్ తర్వాత దేశవ్యాప్తంగా అమలై, స్వర్ణ చతుర్భుజ పథకానికి ప్రేరణ ఇచ్చిందని వివరించారు.పర్యావరణ పరిరక్షణపై దృష్టిసారించిన చంద్రబాబు, రాష్ట్రంలో ప్రస్తుతం 29 శాతం ఉన్న గ్రీన్ కవర్‌ను 50 శాతానికి తీసుకెళ్లే లక్ష్యాన్ని చెప్పారు. వ్యవసాయం, పర్యాటకం, హార్టికల్చర్, ఫిషరీస్ రంగాల్లో ప్రత్యేకమైన ప్రణాళికలతో గ్రామీణ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నారు. అరకు కాఫీని గ్లోబల్ బ్రాండ్‌గా మలచినట్లు, ఇక రాష్ట్రంలోని ఇతర ఉత్పత్తులకు కూడా అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తామని వెల్లడించారు.

వచ్చే ఐదేళ్లలో 50 వేల వరకు..

పర్యాటక రంగాన్ని విస్తరించేందుకు ప్రస్తుతం ఉన్న 5వేల హోటల్ గదుల్ని, వచ్చే ఐదేళ్లలో 50 వేల వరకు పెంచాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. వినూత్న ఆలోచనలెవరి నుండి వచ్చినా స్వీకరించి అమలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

అమరావతి నగర నిర్మాణంపై మాట్లాడుతూ, మొదటి దశను మూడేళ్లలో పూర్తి చేసి, వందేళ్ల అవసరాలకు సరిపడే స్థాయిలో ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. స్వాతంత్య్రం తర్వాత పూర్తిస్థాయి ఆధునిక నగరంగా నిర్మించే తొలి నగరంగా అమరావతి అభివృద్ధి చెందుతుందని చెప్పారు.