భూమిపై ఉండే హక్కు లేదు: అత్యాచార ఘటనలపై చంద్రబాబు
అత్యాచార ఘటనలను ఛీకొట్టాలని, మహిళలైతే ఉమ్మివేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు.
విజయవాడ: అత్యాచార ఘటనలను ఛీకొట్టాలని, మహిళలైతే ఉమ్మివేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆడపిల్లకు రక్షణగా కదులుదాం పేరుతో నిర్వహించిన సభలో ఆయన సోమవారం మాట్లాడారు.
చిన్నపిల్లలపై అఘాయిత్యం చాలా నీచం, దుర్మార్గమని అన్నారు. మానసిక మార్పు కోసం కృషి చేయాలని ఆయన అన్నారు .అత్యాచారాలకు పాల్పడేవారి పట్ల నిర్దాక్షణ్యంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. వాళ్లు మనుషులు కాదు, మృగాళ్లు అని ఆయన అన్నారు.
ఒక ఆడపిల్లపై జరిగన సంఘటన పట్ల దేశమంతా ఆందోళన చెందిందని, నిర్భయ కేసు ఢిల్లీలో జరిగిందని ఆయన చెప్పారు. తాను అనకాపల్లి పాదయాత్రలో ఉన్నప్పుడు మీరు ఏం చేసినా, చేయకపోయినా ఆడపిల్లలకు అండగా ఉండాలని ఓ మహిళ తనను అడిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఢిల్లీలో జరిగిన ఘటన అనకాపల్లిలో ఉన్న ఆడవాళ్లను వణికించిందని ఆయన అన్నారు. ఆడపిల్లలు ధైర్యంగా రోడ్డు మీదకు రావాలని ఆయన అన్నారు. లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
ఫోక్సో చట్టం సవరణపై అవగాహన పెంచాలని ఆయన అన్నారు. ఆడపిల్ల జోలికి వెళ్తే ఉరిశిక్ష వేస్తారనే భయం రావాలని ఆయన అన్నారు. దాచేపల్లి లాంటి ఘటనలు మానవత్వానికే సవాల్ అని అన్నారు. అలాంటి ఘటనలకు పాల్పడే వారికి భూమిపై ఉండే హక్కు లేదని ఆయన అన్ారు. దాచేపల్లి ఘటన బాధిత బాలికను ప్రభుత్వమే చదివిస్తుందని చెప్పారు.