ఇదేం పద్ధతి: గవర్నర్ పై నిప్పులు చెరిగిన చంద్రబాబు
గవర్నర్ నరసింహన్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
రాజమండ్రి: గవర్నర్ నరసింహన్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ వివాదాస్ప వ్యవహార శైలిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా గవర్నర్ ప్రతిపక్షాలను ఏకం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ విషయం వార్తాపత్రికల్లో వచ్చిందని, గవర్నర్ ఆ విధంగా వ్యవహరించడం సరైంది కాదని అన్నారు.
గవర్నర్ వివక్షపూరితంగా వ్యవహరించడం సరి కాదని అన్నారు. కొద్ది రోజుల క్రితం గవర్నర్ నరసింహన్ తో చంద్రబాబు దాదాపు రెండు గంటల పాటు సమావేశమయ్యారు. ఆ తర్వాత కేంద్రానికి నివేదిక సమర్పించడానికి ఢిల్లీ వెళ్లారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా సంచలననం సృష్టిస్తోంది.
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా ద్వారపూడి గ్రామంలో మంగళవారం జరిగిన సభలో చంద్రబాబు గవర్నర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగమవుతోందని, అందుకే చాలా కాలంగా కేంద్రానికి గవర్నర్ ఏజెంట్లుగా వ్యవహరించడాన్ని తెలుగుదేశం వ్యతిరేకిస్తోందని అన్నారు.