చంద్రబాబు ఆలోచనలకు కేంద్రం చెక్ ?
- పోలవరం ప్రాజెక్టు విషయంలో అందరి అనుమానాలకు తగ్గుట్లుగానే కేంద్రం పావులు కదుపుతోంది.
పోలవరం ప్రాజెక్టు విషయంలో అందరి అనుమానాలకు తగ్గుట్లుగానే కేంద్రం పావులు కదుపుతోంది. ప్రాజెక్టుపై కాఫర్ డ్యాం నిర్మించాలన్న చంద్రబాబునాయుడు ఆలోచనలను కేంద్రప్రభుత్వం తోసిపుచ్చింది. ప్రాజెక్టలో ప్రధాన డ్యాంలో అంతర్భాగంగా ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం సరికాదని కేంద్ర జలవనరుల శాఖమంత్రి నితిన్ గడ్కరీ ఓఎస్డీగా పనిచేస్తున్న సాంకేతిక సలహాదారు సంజయ్ కోలా పుల్కర్ తేల్చేసారు. కాఫర్ డ్యాం నిర్మాణం అవసరం, పనుల పురోగతి తదితరాలను పరిశీలించేందుకు పుల్కర్ శనివారం పోలవరం ప్రాజెక్టు క్షేత్రస్ధాయిలో తిరిగారు. ఆ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ, ‘గోదావరి వంటి మహానదిపై అతుకులతో కాఫర్ డ్యాం నిర్మాణం ఎంతమాత్రం సరికాద’ని అభిప్రాయపడ్డారు. ‘అసలు ఇలాంటి ప్రతిపాదన ఉందని తనకు ముందే తెలిసి ఉంటే అప్పుడే వ్యతిరేకించి ఉండేవాడిని’ అని కూడా చెప్పటం గమనార్హం.
పుల్కర్ తాజా వ్యాఖ్యలను బట్టి కేంద్రం మనోగతమేంటో స్పష్టమవుతోంది. ఎందుకంటే, జనవరి మొదటివారంలో నితిన్ గడ్కరీ కూడా పోలవరం పరిశీలనకు వస్తున్నారు. పుల్కర్ నివేదిక ప్రకారమే గడ్కరీ కూడా మాట్లాడుతారన్న విషయంలో సందేహం అవసరం లేదు. పోలవరం ప్రాజెక్టు విషయం కాఫర్ డ్యాం నిర్మించాలని చాలా కాలంగా చంద్రబాబునాయుడు పట్టుదలగా ఉన్నారు. అదే విషయాన్ని ఉన్నతాధికారులు కూడా చాలా సందర్భాల్లో ఢిల్లీలో కేంద్ర జలవరుల శాఖలో కూడా చెప్పారు. కానీ కాఫర్ డ్యాం నిర్మాణ ప్రతిపాదనల గురించి తనకు ఇపుడే తెలిసిందని పుల్కర్ చెప్పటం విచిత్రంగా ఉంది.
పుల్కర్ తాజా వ్యాఖ్యలను బట్టి కాఫర్ డ్యాం నిర్మాణ ప్రతిపాదనను కేంద్రం దాదాపు తోసిపుచ్చటం ఖాయమనే అర్ధమవుతోంది. సాంకేతిక సలహాదారులిచ్చిన నివేదికను కాదని చంద్రబాబు నిర్ణయానికి కేంద్రంమంత్రి మద్దతుగా నిలబడే అవకాశం దాదాపు ఉండదు. అంటే ఒక్కొక్క అంశంలో చంద్రబాబును కేంద్రం పక్కనపెట్టేస్తున్న విషయం స్పష్టమవుతోంది.
కాంట్రాక్టర్ ను మార్చటాన్ని వ్యతిరేకించిన కేంద్రం నిధుల విషయంలో కూడా రాష్ట్రప్రభుత్వం లెక్కలతో విభేదిస్తోంది. తాము విడుదల చేసిన నిధులకు లెక్కలు చెప్పేంత వరకూ మళ్ళీ నిధులు ఇచ్చేది లేదని తేల్చేసింది. జరుగుతున్న పనుల పరిశీలన పేరుతో ఒకటికి నాలుగు కమిటీలను వేసి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తోంది. గడ్కరి మాట్లాడుతూ ప్రతీ 15 రోజులకొకసారి తానే స్వయంగా పర్యవేక్షిస్తానని చంద్రబాబుకే నేరుగా స్పష్టంగా చెప్పటంతో కేంద్రం ఆలోచనలు ఏంటో అర్ధమైపోతోంది.