చంద్రబాబు, లోకేష్లను చంపుతామంటూ వ్యాఖ్యలు.. వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరులపై కేసు
సత్యసాయి జిల్లా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు , లోకేష్ లను చంపుతామని పరిటాల కుటుంబాన్ని భూస్థాపితం చేస్తామని రాఫ్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
సత్యసాయి జిల్లా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తోపుదుర్తి చందు, రాజశేఖర్ రెడ్డిలపై సీకే పల్లి పీఎస్లో కేసు నమోదు చేశారు. అలాగే సీకే పల్లికి చెందిన మరికొందరు వైసీపీ నాయకులపైనా కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యకర్త గంటాపురం జగ్గుపై దాడి చేసిన వైసీపీ నాయకులపై బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. అయితే బాధితుడు జగ్గుపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టి జైలుకు పంపారు పోలీసులు. దీంతో పాటు పోలీస్ 30 యాక్ట్ ఉల్లంఘించారని మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, బీకే పార్థసారథిలపై సుమోటాగా కేసు నమోదు చేశారు.
అంతకుముందు చెన్నెకొత్తపల్లి పోలీస్ స్టేషన్ వద్ద మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ , మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథితో పాటు టీడీపీ శ్రేణులు ఆదివారం ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు , లోకేష్ లను చంపుతామని పరిటాల కుటుంబాన్ని భూస్థాపితం చేస్తామని రాఫ్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు బత్తలపల్లికి చెందిన టీడీపీ నేత జగ్గు కౌంటరిచ్చారు. దీంతో జగ్గును శనివారంనాడు అర్ధరాత్రి పోలీసులు తీసుకెళ్లారని టీడీపీ నేతలు ఆరోపించారు.
Also Read:అనంతలో ఉద్రిక్తత:చెన్నెకొత్తపల్లి పోలీస్స్టేషన్ ముందు పరిటాల సునీత ఆందోళన
జగ్గు కోసం చెన్నే కొత్తపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చిన తమ పార్టీ నేతలపై వైసీపీ నేతలు దాడికి దిగారని మాజీ మంత్రి పరిటాల సునీత చెప్పారు. జగ్గు అనుకొని పొరపాటున ఆయన సోదరుడిని తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారని సునీత ఆరోపించారు. టీడీపీ నేత జగ్గును వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. వైసీపీ నేతలకు సహకరించిన చెన్నెకొత్తపల్లి పోలీసులను సస్పెండ్ చేయాలని సునీత డిమాండ్ చేశారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు, లోకేష్ లను చంపుతామని వ్యాఖ్యానించిన తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిపై కేసులు నమోదు చేయాలని పరిటాల సునీత కోరారు.
మరోవైపు.. చెన్నెకొత్తపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో టీడీపీ నేతల వాహనాలను వైసీపీ నేతలు ధ్వంసం చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు.
బత్తలపల్లి మండలానికి చెందిన టీడీపీ నేత జగ్గును అరెస్ట్ చేసే వరకు తాము ఆందోళన విరమించోమని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. టీడీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలపై కేసులు నమోదు చేయాలని కూడా సునీత డిమాండ్ చేశారు.