తెలుగు రాష్ట్రాల్లొ ఉగ్రవాద కదలికలు బైటపడుతున్న నేపథ్యంలో విజయవాడలో బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది.

Vijayawada : ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రముఖ నగరం విజయవాడలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. నగరంలో నిత్యం రద్దీగా ఉండే బీసెంట్ రోడ్డులో బాంబు పెట్టామంటూ పోలీస్ కంట్రోల్ రూంకు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్ తో అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. ఉదయమే తెరిచిన కొన్ని షాపులను మూయించి ప్రజలను అక్కడినుండి పంపించేసి ఈ తనిఖీలు చేపట్టారు. అయితే ఎక్కడా బాంబు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ఎవరైనా ఆకతాయిలు ఈ ఫోన్ కాల్ చేసారా? లేక నిజంగానే విజయవాడలో ఏదయినా కుట్రలు జరుగుతున్నాయా? అన్నది తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ఫోన్ కాల్ ఎక్కడినుండి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. బాంబు బెదిరింపుల నేపథ్యంలో విజయవాడ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.. పోలీస్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు.

తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాదుల కదలికలు బైటపడిన నేపథ్యంలో ఈ బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపుతోంది. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఓ విద్యార్థి పోటీ పరీక్షలకు సిద్దమయ్యేందుకు హైదరాబాద్ వెళ్లి ఉగ్రవాదంపై ఆకర్షితుడయ్యాడు. హైదరాబాద్ లో బాంబు పేలుళ్లకు కుట్రపన్నిన అతడు తన స్వస్థలం విజయనగరంలో ఇందుకోసం రిహార్సల్ కు సిద్దమయ్యాడు. అయితే అతడి కుట్రలను పసిగట్టిన పోలీసులు అరెస్ట్ చేసారు. ఇలా హైదరాబాద్ లో సిరాజ్, సమీర్ అనే ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.