టీడీపీ మహానాడుకు బాలయ్య హాజరు కావట్లేదు. జార్జియాలో అఖండ 2 షూటింగ్తో బిజీగా ఉన్నట్టు సమాచారం.
తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన మహానాడు సమావేశాలు కడపలో మూడు రోజుల పాటు సాగుతున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలతో సందడి నెలకొంది. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని ఘన నివాళుల కార్యక్రమాలు నిర్వహించగా, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబునాయుడును మళ్లీ ఎన్నుకున్నారు. అయితే రాయలసీమ లో జరుగుతున్న ఈ పెద్ద సభకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గైరు హాజరవడం పార్టీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
బాలకృష్ణ ఎందుకు రాలేదన్న ప్రశ్నకు సమాధానంగా, ఆయన ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్టు సమాచారం. 'అఖండ 2 : తాండవం' సినిమా షూటింగ్ కోసం జార్జియా వెళ్లిన బాలయ్య, అక్కడ బిజీ షెడ్యూల్లో ఉన్నట్టు తెలిసింది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జార్జియాలోనే చిత్రబృందం ప్రత్యేకంగా నివాళులు అర్పించినట్టు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి.
10 రోజుల పని మాత్రమే..
సోషల్ మీడియాలో అందుతున్న వివరాల ప్రకారం, బాలయ్య జూన్ 6న భారత్కు తిరిగొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత షెడ్యూల్లో యాక్షన్ పార్ట్ ఎక్కువ భాగం పూర్తయిందని, 10 రోజుల పని మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది. తరువాతి షెడ్యూల్ జులైలో ప్రారంభమవుతుందని, మొత్తం షూటింగ్ సెప్టెంబర్ మొదటి వారానికి పూర్తవుతుందని అంచనా.
ఈ సినిమా సెప్టెంబర్ 25న పాన్ ఇండియా విడుదల చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది. బాలయ్య షూటింగ్తో బిజీగా ఉన్నప్పటికీ, ఎప్పుడైతే సమయం దొరికితే తన నియోజకవర్గమైన హిందూపురంలో ప్రజల మధ్య ఉంటున్నారు. ఇటీవల పద్మభూషణ్ అవార్డు రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించిన బాలయ్య, అనంతరం హిందూపురంలో భారీగా పౌరసన్మానం కూడా పొందారు.
ఆ కారణంగానే…
ఈ కార్యక్రమాల అనంతరం నేరుగా జార్జియాకు వెళ్లిన ఆయన, షూటింగ్ కారణంగానే మహానాడుకు హాజరు కాలేకపోయినట్టు తెలుస్తోంది. ఇంకేమీ ప్రత్యేక కారణాలు లేవని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మే 29న జరిగే మహానాడు ముగింపు సభకు బాలయ్య హాజరయ్యే అవకాశాలపై అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.