జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద టీడీపీ ఎమ్మెల్సీ బిటెక్ రవి ఎదురుదాడి చేశారు. అమరావతి రైతులకు మద్దతుగా పవన్ కల్యాణ్ తన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తో రాజీనామా చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.

గుంటూరు: అమరావతి రైతులకు మద్దతుగా వైసీపీ, టీడీపీ కృష్ణా, గుంటూరు శాసనసభ్యులు రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఎమ్మెల్సీ బిటెక్ రవి ఎదురు దాడి చేశారు. మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ టీడీపీ నేత బిటెక్ రవి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా సమర్పించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ముందు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తో రాజీనామా చేయించాలని ఆయన పవన్ కల్యాణ్ ను డిమాండ్ చేశారు. శాసనసభలో ఏకైక జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. అయన పవన్ కల్యాణ్ ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. జనసేన నిర్ణయాలకు విరుద్ధంగా ఆయన వ్యవహరించిన సందర్భాలున్నాయి.

Also Read: చిచ్చు పెట్టిన పవన్: వల్లభనేని వంశీ రాజీనామా సరిపోదన్న బుద్ధా వెంకన్న

మూడు రాజధానుల బిల్లును పవన్ కల్యాణ్ వ్యతిరేకిస్తుంటే రాపాక వరప్రసాద్ మద్దుత తెలిపారు. ఇతర కొన్ని విషయాల్లో కూడా పవన్ కల్యాణ్ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆయన నడుచుకున్నారు. ఈ స్థితిలో బిటెక్ రవి చేసిన డిమాండ్ తో పవన్ కల్యాణ్ కు చిర్రెత్తుకొచ్చే అవకాశాలు లేకపోలేదు. అమరావతిపై పవన్ కల్యాణ్ తన వైఖరిని స్పష్టం చేయాలని కూడా డిమాండ్ చేశారు 

ఇదిలావుంటే, వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ బిటెక్ రవి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ము ధైర్యం ఉంటే కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్యెల్యేలు రాజీనామా చెయ్యాలని ఆయన సవాల్ చేశారు. జగన్మోహన్ రెడ్డికి భయపడి, రాజీనామా చెయ్యలేకపోతున్నారని ఆయన అన్నారు. రాజధానికి సంబంధం లేని తాను రాజీనామా చేశానని ఆయన చెప్పారు.

Also Read: మరో అమరావతి రైతు మృతి... ఇంకెంతమంది రైతులు బలవ్వాలి?: చంద్రబాబు ఆగ్రహం

 పాలనా వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ బిటెక్ రవి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన సోమవారం అమరావతి రాజధాని ప్రాంతం తూళ్లూరులో సోమవారం పర్యటించారు. ఇక్కడి ప్రజల చేత ఓట్లు వేయించుకున్న వైసీపీ ప్రతినిధులు ఎందుకు రాజీనామా చేయడంలేదని ఆయన అడిగారు. 

ఎన్నికలకి ముందు రాజధాని ఇక్కడే ఉంటుందని జనాన్ని నమ్మించడం వల్లే వైసీపీ అభ్యర్థులకు ఓట్లు పడ్డాయని ఆయన అన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో మూడు రాజధానులు ప్రతిపాదన ఎందుకు పెట్టలేదని అడిగారు. మ్యానిఫెస్టోలో మూడు రాజధానులు ప్రతిపాదన పెట్టి ఉంటే ఖచ్చితంగా వైసీపీ ఓడిపోయి ఉండేదని అన్నారు. ఇక్కడ అందరూ పెయిడ్ ఆర్టిస్టులు అయితే... వైసిపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్ళీ గెలవాలని, తాను శాశ్వతంగా రాజకీయలనుండి తప్పుకుంటానని ఆయన అన్నారు. 

ఎన్నికల మ్యానిఫెస్టో ని బైబిల్, ఖురాన్ లతో పోల్చే జగన్మోహన్ రెడ్డి అమరావతి గురించి ఎందుకు ప్రస్తావించడం లేదని అడిగారు. తాము ప్రజల్లో తిరగలేకపోతున్నామని ఇక్కడి ప్రజా ప్రతినిధులు సీఎం జగన్మోహన్ రెడ్డి తో చెప్పాలని ఆయన అన్నారు. అలా చెప్పే ధైర్య లేకపోతే దద్దమ్మలమని రాజధాని వాసులతో చెప్పాలని ఆయన అన్నారు.