అర్టీసి డ్రైవర్లుగా మహిళలు : చంద్రబాబు
త్వరలో నియామకాలు
త్వరలో ఆంధ్ర ప్రదేశ్ ఆర్టీసి బస్సులను మహిళలు నడపబోతున్నారు.
ఆర్టీసీ బస్సు డ్రైవర్లుగా మహిళలకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుప్రకటించారు.
ఈ రోజు అమరావతిలో మొదలయిన మూడు రోజుల భారత మహిళల పార్లెమెంటు సదస్సలో ప్రసంగిస్తూ ఆయన ఈ విషయం వెల్ల డించారు.
కర్నాటక వంటి రాష్ట్రాలు (పై ఫోటో) ఇప్పటికే మహిళలను డ్రైవర్లు గా నియమించాయి.
తొందర్లో దీని మీద నిర్ణయం తీసుకుంటామని ఆయన ప్రకటించారు. ఇదొక చారిత్రక నిర్ణయం అవుతుంది.
అత్యంత పవిత్రమైన ప్రదేశంలో తొలి జాతియ మహిళా పార్లమెంటు నిర్వహించుకుంటుండటం సంతోషంగా వుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఒకే ఏడాదిలో రెండు పుష్కరాలు ఘనంగా నిర్వహించామని, ఇప్పుడు జాతీయ మహిళా పార్లమెంట్ను అందరి సహకారంతో ఘనంగా నిర్వహిస్తూ మరో చరిత్ర సృష్టించామని అన్నారు.
కొత్త రాజధానిలో ఇంత పెద్ద సదస్సు నిర్వహణకు చొరవ చూపిన శాసనసభ సభాపతి కోడెల శివప్రసాదరావును ఆయన అభినందించారు.
అమరావతి నుంచే శాతవాహనులు ఆనాడు పరిపాలన సాగించారని, అమరావతికి ఆ చారిత్రక వారసత్వాన్ని కొనసాగిస్తున్నామని అన్నారు. అమరావతి నుంచే బౌద్ధమతం విస్తరించిందని, దలైలామా మరోమారు ఇక్కడికి రావడం ఆనందంగా వుందని చెప్పారు. ఇందిరాగాంధీ భారత ప్రధానమంత్రిగా కీలక భూమిక పోషించారని, అలాగే, ఎంతోమంది మహిళా నేతలు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా కీలక భూమిక వహించారని చెప్పారు.
‘ప్రతి మహిళా కలలు కనాలి.. దాన్ని సాకారం చేసేందుకు ప్రయత్నించాలి’ అని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి- తమ ఇంట్లో భార్య, కోడలు కుటుంబ వ్యాపారాన్ని చూసుకోవడం చూసి గర్వపడుతుంటానని చెప్పారు.
మహిళా సాధికారతకు ఇదే తార్కాణమని అన్నారు. మహిళా సాధికారితతో పాటు ఇతర అంశాలపైనా దృష్టి సారించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సదస్సుకు పిలుపునిచ్చారు.
ఆర్థిక వ్యవస్థలో మహిళలదే కీలక భూమిక