నాలుగేళ్ళు దొంగలపార్టీతో కలిసి ఉన్నాం: కళా వెంకట్రావ్
బిజెపి, వైసీపీపై టిడిపి నేతల ఘాటు విమర్శలు
అమరావతి:నాలుగేళ్ళుగా దొంగల పార్టీతో తాము కలిసి పనిచేశామని ఏపీ మంత్రి, టిడిపి ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. ప్రధానమంత్రి మోడీ కంటే ఏపీ సీఎం చంద్రబాబునాయుడే సీనియర్ అని ఆయన చెప్పారు.
శనివారం నాడు ఆయన శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు. నాలుగేళ్లు దొంగల పార్టీతో కలిసి పనిచేస్తే ఏపీకి మట్టి ముద్ద తప్ప ఏమీ ఇవ్వలేదని పేర్కొన్నారు. ప్రధాని మోదీకి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు పనికిమాలిన నాయకులే కావాలి తప్ప చంద్రబాబు లాంటి నాయకుడు అవసరం లేదని అభిప్రాయపడ్డారు. బీజేపీ అంటేనే ప్రజలు తరిమికొట్టే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయన్నారు. మోదీకన్నా చంద్రబాబునాయుడు సీనియర్ చంద్రబాబు మాత్రమేనని ఆయన చెప్పారు.
బిజెపి, వైసీపీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరే: బుద్దా వెంకన్న
వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ, వైసీపీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి అవడం ఖాయమని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అభిప్రాయపడ్డారు. సీఎం చంద్రబాబుపై బీజేపీ, వైసీపీ కుట్ర చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. శనివారం నాడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. గోద్రా అల్లర్లలో ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా మోదీ వ్యవహరించారని దీనిని వ్యతిరేకించినందుకే చంద్రబాబుపై కుట్ర జరుగుతోందని అన్నారు.
ప్రధానిగా మోదీ ఉన్నంత వరకూ దేశ ప్రజలకు రక్షణ ఉండదన్నారు. మోదీ, అమిత్ షాకు వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు ఆ పార్టీ నేతలు రాష్ట్ర సమాచారాన్నిఅందిస్తున్నారని ఆరోపించారు. మోదీని గద్దె దించే దమ్ము చంద్రబాబుకే ఉందని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.