ఏపీలో మెటర్నిటీ సెలవులను 120 నుంచి 180 రోజులకు పెంచుతున్నట్లు కూటమి సర్కార్ ప్రకటించింది. పిల్లల సంఖ్యకు సంబంధం లేకుండా ప్రతి సారి సెలవుల అమలు అవుతాయని వివరించింది.

ఆంధ్రప్రదేశ్‌లో మహిళా ఉద్యోగులకు గుడ్‌న్యూస్ అందింది. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం మెటర్నిటీ లీవ్‌పై కీలకంగా ముందడుగు వేసింది. ఇప్పటి వరకు మహిళలకు 120 రోజుల ప్రసూతి సెలవులు మాత్రమే లభించేవి. కానీ తాజా నిర్ణయంతో ఇకపై ఆ సెలవులు 180 రోజులకు పెరిగాయి. అంటే అదనంగా రెండు నెలలు మహిళలు ఇంట్లోనే ఉండి, తమ పిల్లలకు సమయం కేటాయించుకునే అవకాశం లభిస్తుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇది ఒక్కటే కాదు, మరో ముఖ్యమైన మార్పు కూడా చేశారు. ఇప్పటివరకు ఈ మెటర్నిటీ సెలవులు కేవలం ఇద్దరు పిల్లలకే వర్తించేవి. మూడో సంతానం ఉంటే మాత్రం అలాంటి సెలవుల కోసం అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ఆ పరిమితిని తీసేయడంతో, ఎంతమంది పిల్లలకు జన్మనిచ్చినా ప్రతి సారి మహిళా ఉద్యోగులకు మెటర్నిటీ సెలవులు వర్తిస్తాయి.

ఇది తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలా అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం చెప్పింది. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళా ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌ను మెరుగుపరిచే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.

ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక మహిళా ఉద్యోగుల్లో ఈ నిర్ణయం పట్ల ఆనందం వ్యక్తమవుతోంది. పిల్లల సంరక్షణకు కావలసిన సమయం దొరకడం వల్ల కుటుంబ జీవితం, ఉద్యోగ జీవితం మధ్య సమతుల్యత పెరుగుతుందని వారు అంటున్నారు.