తెలుగుదేశం పొత్తు పెట్టుకోనిది ఒక్క వైసీపీతోనే... టీడీపీకి జనసేనకి పెళ్లిళ్లు, విడాకులు కామన్ : బుగ్గన
వైసీపీ నేతలను చెప్పుతో కొడతానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కౌంటరిచ్చారు ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. రాజకీయాల్లో వున్నప్పుడు ఓపిక వుండాలని ఆయన హితవు పలికారు.
ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోని పార్టీ అంటూ లేదన్నారు వైసీపీ సీనియర్ నేత, ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక్క వైసీపీతో తప్ప అన్ని పార్టీలతో టీడీపీ పొత్తు పెట్టుకుందన్నారు. టీడీపీ- జనసేన మధ్య పెళ్లిళ్లు, విడాకులు అనేవి సాధారణమేనని బుగ్గన సెటైర్లు వేశారు. ఇదే సమయంలో వైసీపీ నేతలను చెప్పుతో కొడతానంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపైనా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. రాజకీయాల్లో వున్నప్పుడు ఓపిక వుండాలని ఆయన హితవు పలికారు. ఈజ్ ఆఫ్ డూయింగ్లో రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో వుందని.. ఎగుమతుల్లో 4వ స్థానంలో వుందని బుగ్గన తెలిపారు. రాజధాని ఒకే ప్రాంతంలో వుండటం వల్లే గతంలో ప్రాంతీయ అసమానతలు వచ్చాయని, అందువల్లే మూడు రాజధానులను అభివృద్ధి చేయాలనుకుంటున్నామని రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు.
అంతకుముందు వైసీపీ నేతలపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. ప్రజలకు ఏం చేయనివారు, చెప్పుకోవడానికి ఏం లేనివారే బూతులు తిడుతున్నారని విమర్శించారు. వీధి రౌడీలు కూడా అలాంటి మాటల మాట్లాడరేమోనని అన్నారు. చెప్పులు చూపిస్తూ దారుణమైన మాటలు మాట్లాడుతుంటే వీళ్లేనా మన నాయకులు అని బాధ అనిపిస్తోంది. దత్త పుత్రుడితో దత్త తండ్రి ఏం మాట్లాడిస్తున్నామో కూడా చూస్తున్నామని అన్నారు. అవనిగడ్డ ప్రభుత్వ కాలేజ్లో నిర్వహించిన రైతుల క్లియరెన్స్ పత్రాల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు.
ALso REad:మూడు పెళ్లిళ్లతోనే మేలని చెబుతున్నారు, ఒక్క జగన్ను కొట్టడానికి ఇంతమంది ఏకం: వైఎస్ జగన్
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మూడు రాజధానుల వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందుతాయని చెబితే.. కాదు మూడు పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతుందని అంటున్నారని ఎద్దేవా చేశారు. వీరు కూడా చేసుకోండి అని ఏకంగా టీవీల్లోనే చెబుతున్నారని విమర్శించారు. ‘‘ఇలా మాట్లాడితే మన ఇంట్లో ఆడవాళ్ల పరిస్థితేమిటి..? కూతుళ్ల పరిస్థితేమిటి..?, చెల్లమ్మల పరిస్థితేమిటి..? అనేది ఆలోచన చేయాలి. ఇలా ప్రతి ఒక్కరు కూడా నాలుగేళ్లు, ఐదేళ్లు కాపురం చేసి.. ఎంతో కొంత ఇచ్చి విడాకులు ఇచ్చేసి మళ్లీ పెళ్లిచేసుకోవడం మొదలు పెడితే.. ఒకసారి కాదు, రెండు సార్లు, మూడు సార్లు, నాలుగు సార్లు చేసుకోవడం మొదలు పెడితే.. మీరు చేసుకోండి అని చెబుతూ పోతే.. వ్యవస్థ ఏం బుతుకుతుంది. ఆడవాళ్ళ మాన ప్రాణాలు ఏం కావాలి?.. అక్కాచెల్లెమ్మల జీవితాలు ఏం కావాలి?.. ఇలాంటి వాళ్ల మనకు నాయకులు అని ఒక్కసారి ఆలోచన చేయండి’’ అని సీఎం జగన్ అన్నారు.